పల్స్ పోలియోను విజయవంతం చేయాలి..

28న పోలియో బూత్ డే
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. ఈ నెల 28న పోలియో బూత్ డే నిర్వహిస్తున్నట్లు ఈ నెల 29, 30 తేదీలలో ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 62,902 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, పోలియో చుక్కల పంపిణీ కోసం జిల్లాలో 381 బూత్‌లు, 25 మొబైల్ టీమ్స్, 24 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి చిన్న పిల్లల వివరాలను సేకరించాలన్నారు.

ముఖ్యంగా వలస కూలీలు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగంలో పనిచేసే వారి పిల్లలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండే అవకాశం ఉన్నందున, వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల వంటి రద్దీ ప్రదేశాలలో ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ప్రయాణికులకు కూడా సేవలందించాలని, ఈ ప్రక్రియలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారుల సమన్వయం తప్పనిసరి అని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదన్నారు. అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.