హైదరాబాద్ – ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఆయనకు నివాళి అర్పించారు. ఈ ఉదయం వాళ్లు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు..
ఇది ఇలా ఉంటే , ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
నాన్నకు భువనేశ్వరి నివాళి
ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ జయింతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు. మనవడు దేవాన్ష్ తో కలసి ఘాట్ కు వచ్చిన ఆమె ముందుగా తండ్రి సమాధి పై పూలు చల్లి అంజలి ఘటించారు..