మోడీ విదేశీ పర్యటనకు ప్రవాస భారతీయుల బ్రహ్మరథం

మోడీ విదేశీ పర్యటనకు ప్రవాస భారతీయుల బ్రహ్మరథం

న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ నుంచి మోడీ నాయకత్వానికి ప్రశంసలు

భారత్‌లో పెట్టుబడులకు విదేశీ దేశాల ఆసక్తి

ప్రవాస భారతీయుల ఘన స్వాగతంతో ముగిసిన మూడు దేశాల పర్యటన

వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి భారత్‌ను లాంచింగ్ ప్యాడ్ వరకూ తీసుకుని వెళ్లిన ఘనత మన ప్రధాని నరేంద్రమోడీకి దక్కుతుంది. 21వ శతాబ్దం భారతేననీ, భారత్తో కలిసి పని చేస్తామని న్యూజిలాండ్ ప్రధాని క్రిష్టఫర్ లక్సన్ ప్రకటించారు.

25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. మోడీ హయాంలో భారత్ సాధించిన అభివృద్ధి అనన్య సామాన్యమనీ, పేదరికం నుంచి వచ్చి పేదలను వృద్ధిలోకి తెచ్చిన నాయకునిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారని లక్సన్ అన్నారు.

ఈ రోజు ప్రపంచం అంతా భారత్ వైపు చూడటానికి మోడీ నాయకత్వమే కారణమని అన్నారు. మోడీ జరిపిన మూడు దేశాల పర్యటన శనివారంతో ముగిసింది. ఆయన వెళ్లిన చోటల్లా భారత్‌కు జైజైలు పలుకుతూ, అపూర్వ స్వాగతం చెప్పారు.

మోడీ సమాధానమిస్తూ వచ్చే పదిహేనేళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. భారత్‌లో ఖర్చు చేసే ప్రతి డాలర్‌కు అంతకు అంత లబ్ధి కలుగుతుందన్న నమ్మకం ఉండబట్టే న్యూజిలాండ్ అయినా, మరో దేశమైనా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు.

పట్టణాలలో రవాణా, నీరు, వ్యర్థాల నిర్వహణలో న్యూజిలాండ్ భాగస్వామ్యాన్ని మోడీ ఆహ్వానించారు. భారత్‌కు న్యూజిలాండ్ ఎగుమతి చేసే ఉత్పత్తులపై 57 శాతం సుంకాలు ఉండవని న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ ప్రకటించడం భారత్‌తో వ్యాపారం ఎంత లాభసాటిదో అంగీకరించడమేనని అన్నారు.

న్యూజిలాండ్ వృద్ధిలో ప్రవాస భారతీయుల శ్రమ, సహకారాన్ని లక్సన్ ప్రశంసించారు. న్యూజిలాండ్ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రవాస భారతీయులు ఎంతో శ్రమిస్తున్నారని ఆయన ప్రశంసించారు.

సాంకేతికంగా కూడా భారత్ అమెరికా, చైనా తదితర దేశాలతో పోటీ పడే రీతిలో వృద్ధి చెందుతోందనీ, ఇందుకు మోడీ తీసుకుంటున్న చర్యలే కారణం అన్నారు.

నలభై ఏళ్లలో న్యూజిలాండ్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.

మోడీ జరిపిన మూడు దేశాల పర్యటనలో ఎక్కడికి వెళ్లినా ప్రవాస భారతీయులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన ప్రసంగాలను వినడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రవాస భారతీయులు తరలివచ్చారు. మోడీ ప్రసంగాలు ప్రవాస భారతీయులను విశేషంగా ఆకర్షించాయి.

స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలన్న మోడీ పిలుపునకు సానుకూల స్పందన లభించింది.

ఆస్ట్రేలియా నుంచి మోడీ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకున్నప్పుడు అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం చెప్పారు. మోడీ కోసం వారు ‘కియా ఓరా మోడీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

మోడీ ప్రసంగాన్ని వినేందుకు గంటల తరబడి ప్రవాస భారతీయులు నిరీక్షించారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోడీకి ప్రవాస భారతీయులు అపూర్వమైన స్వాగతం చెబుతున్నారు.

మోడీ పాలనలో సాధిస్తున్న అభివృద్ధి గురించి వార్తాప్రసార సాధనాల్లో వారు వింటున్నప్పటికీ, ఆయన నోట వినాలనే ఉత్సాహంతో ఆయన సభకు తరలివచ్చారు.