Mahakumbamela | మాఘ పూర్ణిమ – మ‌హాకుంభ‌మేళాలో పోటెత్తిన భ‌క్త జ‌నం …

తెల్ల‌వారుజామునే కోటి మందికి పైగా పుణ్య స్నానాలు
భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్న ఘాట్ లు

ప్ర‌యోగ రాజ్ , ఉత్త‌ర ప్ర‌దేశ్ః మాఘ పూర్ణిమ పర్వదినం సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి లక్షలాదిగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు చేరుకుంటున్నారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ ఇవాళ మరింత పెరిగిపోయింది. తెల్లవారుజాము నుంచే మాఘ పూర్ణిమ పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 6 గంటల వరకు కోటి మందికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని యూపీ సర్కార్‌ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ లఖ్‌నవూ నుంచి ఏర్పాట్లను, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలని, నిర్దేశించిన ట్రాఫిక్‌ స్థలాల్లో మాత్రమే ఉపయోగించాలని మహాకుంభమేళా పరిపాలనా యంత్రాంగం భక్తులను అభ్యర్థించింది.

మాఘపూర్ణిమతో నెల రోజుల దీక్షకు కల్పవాసీలు ముగింపు పలికారు. ఉదయం 6 గంటల వరకు 10 లక్షల మంది కల్పవాసీలు సహా కోటి మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

మాఘపూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి కంటే ఎక్కువగా బలగాలను మోహరించినట్లు కుంభ్‌ ఎస్‌ఎస్‌పీ రాజేశ్‌ ద్వివేదీ చెప్పారు. రద్దీ నిర్వహణ క్లిష్టంగా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు ప్రయాగ్‌రాజ్‌ ఏడీజీ భాను భాస్కర్‌ తెలిపారు. మాఘపూర్ణిమ సందర్భంగా భక్తులపై హెలికాప్టర్‌ నుంచి పూల వర్షం కురిపించారు. ఇది ఇలా ఉంటే మ‌హాకుంభ‌మేళ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 46 కోట్ల మంది పుణ్య స్పానాలు ఆచ‌రించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *