ఎల్నినో ప్రభావాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం
- నూరు శాతం పంటల బీమా చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
- ఆగస్టు 15తో పంటల బీమా నమోదు గడువు ముగింపు
- ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ
- రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ: ఎల్నినో ప్రభావాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటూ రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పంటల బీమా ద్వారా రైతులకు భరోసా కల్పించేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
జగ్గయ్యపేట వ్యవసాయ శాఖ అధికారులు గురువారం ధర్మవరప్పాడు తండా జెండా చెట్టు వద్ద ఏర్పాటు చేసిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెట్టు కింద రైతులతో కూర్చుని ముచ్చటించారు. రైతుల సాగు పరిస్థితులు, నీటి లభ్యత, పంటల సాగు, ఎరువుల లభ్యత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని రైతులకు వివరించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలిపారు. రైతులు పంటల సాగులో వైవిధ్యాన్ని పాటించాలని కలెక్టర్ సూచించారు.
నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా ఆర్థికంగా మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు. వ్యవసాయ అధికారులు రైతులకు పంటల ఎంపిక, సాగు పద్ధతులు, నీటి వినియోగం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవసరమైన సలహాలు అందించాలని సూచించారు.
ఆగస్టు 15వ తేదీతో ఫసల్ బీమా యోజన బీమా నమోదు గడువు ముగియనున్నందున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ముఖ్యంగా వరి, మిర్చి, పెసర, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులందరూ పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. పంటలకు అనుకోని నష్టం సంభవించినప్పుడు బీమా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు.
జిల్లాలో అర్హులైన రైతులందరికీ పంటల బీమా కల్పించేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. బీమా నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి రైతు బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో రైతులకు బీమా నమోదు ప్రక్రియ, గడువు తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని సందర్శించారు. రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా జరుగుతున్న ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించి, రైతులకు ఎరువులు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిబంధనల ప్రకారం ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా జరుగుతున్న ఎరువుల పంపిణీ విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎరువుల లభ్యత, పంపిణీ ప్రక్రియపై రైతులకు అవసరమైన సమాచారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో జి. అనిల్ కుమార్, జగ్గయ్యపేట ఏడీఏ సి. భవాని, డిప్యూటీ తహసీల్దార్ పి. మనోహర్, డిప్యూటీ ఎంపీడీవో, ఆర్ఎస్కే సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
