కామన్వెల్త్ లో కొత్త చ‌రిత్ర‌..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత క్రీడా రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఫెన్సింగ్‌లో భారత క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టించారు. నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌–2026లో భారత్‌ తొలిసారి ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో సీనియర్‌, అండర్‌-23 విభాగాలను కలిపి భారత్‌ ఏకంగా 35 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 8 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్‌ ప్రతిష్టాత్మకమైన విల్కిన్సన్‌ స్వోర్డ్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. 1982 నుంచి కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ సమాఖ్య అత్యుత్తమ సమగ్ర ప్రదర్శన కనబరిచిన దేశానికి ఈ ట్రోఫీని అందిస్తోంది. తొలిసారి ఈ గౌరవం భారత్‌కు దక్కడం విశేషం.

చివరి రోజున అదరగొట్టిన భారత జట్లు

ఛాంపియన్‌షిప్‌ చివరి రోజు సీనియర్‌ జట్టు విభాగాల్లో భారత ఫెన్సర్లు సత్తా చాటారు. మొత్తం ఆరు విభాగాల్లో ఏకంగా ఐదు స్వర్ణ పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి. పురుషుల సాబ్రే, మహిళల సాబ్రే, పురుషుల ఎపీ, మహిళల ఎపీ, మహిళల ఫాయిల్‌ జట్లు స్వర్ణాలు సాధించాయి. పురుషుల ఫాయిల్‌ జట్టు రజత పతకంతో పోటీలను ముగించింది.

తొలి రోజే పతకాల పంట..

భారత్‌ పతకాల వేట అండర్‌-23 వ్యక్తిగత విభాగాలతో మొదలైంది. తొలిరోజే భారత క్రీడాకారులు 17 పతకాలు సాధించారు. ఇందులో నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, తొమ్మిది కాంస్యాలు ఉన్నాయి. పురుషుల సాబ్రేలో నిఖిల్‌ వాఘ్‌ స్వర్ణం సాధించారు. మహిళల ఫాయిల్‌లో జోయ్స్‌ ఆశిత, మహిళల ఎపీలో ప్రాచీ లోహన్, మహిళల సాబ్రేలో జెఫెర్లిన్‌ స్వర్ణ పతకాలు అందించారు. పురుషుల సాబ్రేలో భారత క్రీడాకారులు పోడియంపై మూడు స్థానాలను దక్కించుకోవడం మరో విశేషం.

సీనియర్‌ విభాగంలోనూ జోరు..

రెండో రోజు సీనియర్‌ వ్యక్తిగత విభాగాలు ప్రారంభం కాగా భారత్‌ మరో ఏడు పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఎపీ విభాగంలో తనిష్కా ఖత్రి స్వర్ణం, ఖుషీ దభాడే రజతం సాధించి భారత క్రీడాకారిణులు స్వర్ణ–రజత విజయాన్ని నమోదు చేశారు.

మూడో రోజు భారత్‌ ఖాతాలో మరో ఐదు పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. సీనియర్‌ మహిళల ఫాయిల్‌లో కనగలక్ష్మి, పురుషుల ఎపీలో రాజేంద్రన్‌ శాంతిమోల్‌ షెర్జిన్‌, పురుషుల సాబ్రేలో కరణ్‌ సింగ్‌ స్వర్ణాలు సాధించారు.

తెరవెనుక శ్రమించిన బృందం..

భారత ఫెన్సర్ల విజయానికి క్రీడాకారుల ప్రతిభతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది కృషి కూడా కీలకంగా నిలిచింది. కోచ్‌లు భరత్‌జీ ఠాకోర్‌, శ్రీహరి పిసే, శంకర్‌ నారాయణన్‌, ఫిజియోథెరపిస్ట్‌ అమృతా బాల్కవాడే, జట్టు మేనేజర్‌ మను త్యాగి క్రీడాకారుల సన్నద్ధత, వ్యూహరచన, శారీరక పునరుద్ధరణ, పోటీల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.

భారత ఫెన్సింగ్‌కు కొత్త దిశ..

లాగోస్‌లో సాధించిన విజయం భారత ఫెన్సింగ్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు ప్రపంచ క్రీడా వేదికపై క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, రెజ్లింగ్‌, అథ్లెటిక్స్‌ వంటి క్రీడలతో ఎక్కువగా గుర్తింపు పొందిన భారత్‌.. ఇప్పుడు ఫెన్సింగ్‌లోనూ తన సత్తాను చాటుతోంది.

35 పతకాలతో పాటు విల్కిన్సన్‌ స్వోర్డ్‌ ట్రోఫీని సొంతం చేసుకోవడం భారత ఫెన్సింగ్‌ భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు శిక్షణ, క్రీడాకారుల అభివృద్ధి, అంతర్జాతీయ పోటీల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలపై దృష్టి పెట్టాలని ఫెన్సింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఒకప్పుడు పెద్దగా వినిపించని ఫెన్సింగ్‌ పేరు.. ఇప్పుడు కామన్వెల్త్‌ వేదికపై భారత విజయగాథలో కీలక అధ్యాయంగా మారింది.