సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు..

సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు..

కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుంది
రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం
విద్యుత్ బిల్లులు పెంచకుండా, అంతరాయం లేని సరఫరాపై దృష్టి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందించడమేకాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని గుణదల విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన కార్యాలయానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కె. విజయానంద్, సీఎండీ పి. పుల్లా రెడ్డి ల సమక్షంలో బుధవారం ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. సుమారు 35 నుండి 40 కోట్ల రూపాయల వ్యయంతో, 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించుకున్నామన్నారని,రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆదేశాలు అనుగుణంగా పనిచేస్తూ.. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, నాణ్యమైన విద్యుత్తును నిరంతరం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్ డిస్టర్బెన్స్ (విద్యుత్ అంతరాయం) ఉండకూడదని, లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అందుకు అనుగుణంగా సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. వినియోగదారులలో విద్యుత్ శాఖ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని ప్రస్తుతం ఉన్న 80% నుండి 95% పైకి తీసుకెళ్లడమే మా లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రైతులకు పగటిపూట విద్యుత్ పీఎం కుసుమ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ అందించడం కోసం చేపట్టిన టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు.

రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి, ఆధునిక పద్ధతులు ఉపయోగించి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని సాధించామన్నారు. పగటిపూట విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేస్తూ, సాయంత్రం పీక్ అవర్స్‌లో మనమే స్వయంగా జనరేట్ చేసుకుంటూ విద్యుత్ లోటు లేకుండా చూస్తున్నామన్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు.

బ్యాటరీ స్టోరేజ్ కోసం ఇప్పటికే 10 చోట్ల టెండర్లు పిలవడం జరిగిందన్నారు. విపత్తు సమయాల్లో విద్యుత్ సిబ్బంది తమ సేవలు నిరంతరాయంగా అందిస్తున్నారన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా విశాఖపట్నంలో తుపాను వచ్చినప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి పనిచేశారన్నారు. దాదాపు 1500 నుండి 2000 మంది సిబ్బంది తమ కుటుంబాలను వదిలి, కేవలం 24 గంటల్లోనే సుమారు 20 వేల విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని కోరారు. పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేసే శాఖగా విద్యుత్ శాఖను మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ… విద్యుత్ కొనుగోలు, అమ్మకాల్లో పారదర్శకత కోసం మానవ ప్రమేయం లేని అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నామన్నారు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో 14,009 మెగావాట్ల విద్యుత్ గరిష్ట లోడ్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ వేసవిలో విద్యుత్ కు ఎటువంటి అంతరాయం లేకుండా 275 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశామన్నారు. ఏపీ జెన్కో ప్లాంట్ల సామర్థ్యాన్ని 85-90% కి పెంచామన్నారు. ఏపీసీపీడీసీఎల్ భవనాన్ని ‘నెట్ జీరో’ కాన్సెప్ట్‌ తోపాటు సోలార్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా విద్యుత్ ఖర్చు తగ్గించడమే కాకుండా కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుని నిర్మించామన్నారు. సీఎండి పుల్లారెడ్డి మాట్లాడుతూ.. డిస్కం అధికారులు అందరూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టరు మురళీ కృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీ వీ ఎస్ ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సి. జి.ఎమ్ లు, జిఎమ్ లు పాల్గొన్నారు.

Leave a Reply