Israeli Attacks | దాడులను ఆపితేనే ముందుకని ప్రకటన

Israeli Attacks | దాడులను ఆపితేనే ముందుకని ప్రకటన
అమెరికాకు తేల్చి చెప్పిన టెహ్రాన్
ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
Israeli Attacks | టెహ్రన్ , ఆంధ్రప్రభ : ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని వాటిని ఆపే వరకూ ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవని తేల్చి చెప్పింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న నానుడి ఇప్పుడు ఇరాన్- అమెరికా యుద్ధంలో సరిగ్గా సరిపోతుంది. శాంతి చర్చలు ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఓసారేమో అమెరికా మెుండి చేయడం.. మరోసారేమో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం ఇదే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి శాంతి చర్చలను వాయిదా వేస్తోన్నట్లు ఇరాన్ ప్రకటించింది.

Israeli Attacks | దాడులే దాడులు
గత వారం తమ అత్యాధునిక ఎంక్యూ-1 డ్రోన్ను ఇరాన్ క్షిపణులు కూల్చేసినందుకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్కు చెందిన రాడార్ వ్యవస్థలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. డ్రోన్లను ప్రయోగించే ప్రయోగకేంద్రాలనూ అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో ప్రతీకారంతీర్చుకుంది.

కువైట్పై ఇరాన్ క్షిపణుల వర్షం
ఇక ప్రతిగా అమెరికా వైమానిక స్థావరాలకు నిలయమైన కువైట్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. డ్రోన్లతో తెగబడింది. వీటిలో దాదాపు అన్నింటినీ కూల్చేశామని కువైట్ పేర్కొంది. ”అంతర్జాతీయ జలాలపై నిఘా, పర్యవేక్షణ విధుల్లో ఉన్న తమ యూఎస్ ఎంక్యూ-1 డ్రోన్ను ఇరాన్ జలసమాధి చేసింది. అందుకే వాళ్ల రాడార్లను మేం నాశనంచేశాం. డ్రోన్ లాంఛింగ్ సైట్లను బూడిదచేశాం. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హార్మూజ్ జలసంధి గుండా మా రక్షణలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడికి బయల్దేరినా డ్రోన్లనూ నేలకూల్చాం. ప్రతిగా ఇరాన్ మొదలెట్టిన దాడుల్లో మా బలగాలకు, మా సైనిక సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు”అని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ఆగ్రహం
గాజా,లెబనాన్లలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, అలాగే లెబనీస్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై తమ డిమాండ్లు, తమ మిత్రదేశాల డిమాండ్లు నెరవేరే వరకు చర్చలు పునఃప్రారంభం కావని తెలిపింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది. కాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టుపక్కల కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 26 ఏళ్లలో లెబనాన్లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే అతిపెద్దది. కాగా లెబనాన్పై ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు.
CLICK HERE TO READ MORE : Janasena | కాంగ్రెస్ నేతలకు పవన్ హెచ్చరిక
