హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించే లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరగకుండానే, పూర్తయిందని తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్ పై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ మేరకు బిల్ కలెక్టర్ జగదీష్ ను విధుల నుండి తొలగిస్తూ జిల్లా పంచాయతీ అధికారి నేడు ఆదేశాలు జారీ చేశారు.
భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 18 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేశారనే తప్పుడు సమాచారాన్ని ఆన్లైన్ లో నమోదు చేశారని, దీనిపై సంబంధిత బిల్ కలెక్టర్ కు మెమో జారీ చేయగా పొరపాటున ఈ సమాచారాన్ని అప్లోడ్ చేయడం అయిందని సంజయిషి ఇవ్వడంతో ఆ బిల్ కలెక్టర్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు.
కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధుల నిర్వహణలో ఏ విధమైన అలసత్వం వహించే ఎంతటి వారినైనా సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.