నక్షత్ర మండల మార్గాన్ని అనుసరించి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మార్గంలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. సదరు మార్గాన్ని మన పూర్వీకులు ఇరవై ఏడు భాగాలుగా విభజించారు. అవి దాదాపు సమానంగా ఉంటాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ భాగంలో ఎక్కువ కాంతి వంతంగా ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ భాగానికి పేరు పెట్టారు. ఇరవై ఏడు నక్షత్రాలలో మఘ ఒకటి. అందులో ఐదు ప్రముఖ నక్షత్రాలు పల్లకి ఆకారంలో చెదరి ఉంటాయి. మాసానికి ఒకసారి చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. కాని ఏడాదిలో ఒకేసారి చంద్రుడు పదహారు కళలతో ఒప్పుతూ మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అదే మాఘ పూర్ణిమ. దానినే ”మహామాఘి” అంటారు.
చంద్రుడు కాంతి నిస్తంద్రుడై ప్రకాశించే దినాలు ఏడాదికి పన్నెండు ఉంటాయి. అవే పదహారు కళలతో ఒప్పుతూ చంద్రుడుండే రోజులు. పన్నెండు పౌర్ణమిలలో ఒక్కొక్క నక్షత్రంతో చంద్రుడు కూడి ఉంటాడు. ఆయా నక్షత్రాలను బట్టి ఆపౌర్ణమిని పిలుస్తారు. మాఘ నక్షత్ర యుక్త పూర్ణిమను మాఘీయని, అలాగే ఫాల్గుణీ, చైత్రీ, వైశాఖీ, జ్యేష్ఠీ, ఆషాడీ, శ్రావణీ, భాద్రపదీ, ఆశ్వ యుజీ, కార్తీకీ, మార్గశీర్షీ అనే పేర్లతో పిలువబడేవి హిందువులకు పన్నెండు పర్వాలు. భోగ్య అర్హమైన శుక్లపక్షం వెన్నెల ఊరికే పోకుండా మన పెద్దలు శుక్ల పక్షంలోనే పండువలు అధికంగా ఏర్పరిచారు. దశావతారాల్లో ఒకటైన కూర్మావతారం, మహాభక్తుడైన హన్మంతుడు, మానవ ప్రపంచంలో మహనీయుడైన గౌతమ బుద్ధుడు పౌర్ణమిల యందే జన్మించారు. ఇక మాఘ పూర్ణమి విషయానికి వస్తే…మఘ నక్షత్రంలో చంద్రుడు పదహారు కళలతో ప్రకాశించే దినమే మాఘ పౌర్ణమి. దీనిని మహామాఘి అని పంచాంగ కర్తలు అంటారు.
పార్వతీ దేవి ఈదినముననే ప్రాదుర్భవించినదని పురాణాధారం. దక్షప్రజాపతికి దక్షిణావర్తపు శంభాకారపు పద్మ ఆకారాన్ని ధరించిన సతీదేవి హస్తస్పర్శతో కన్యగా మారిన రోజే మాఘ పౌర్ణిమ. కావేరీ ఉత్తరాన స్వామిమలపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామి, తెలియని విషయాన్ని విద్యా వేత్తయైన తన తండ్రికి చెప్పిన దినమైనందున అక్కడ ఈరోజు ఉత్సవం జరుగుతుంది. మాహామాఘి నాడే జగద్గురువు ఆదిశంకరులు పంచాయతన పూజావిధిని ప్రారంభించారంటారు. మహా మాఘి అనబడే ఈ పర్వం పేరిటనే కుంభకోణంలో దాదాపు ఇరవై ఎకరాల వైశాల్యం కలిగిన ఒక కోనేరు ఉంది. తంజావూరు తెలుగు నాయక రాజులు ఆ కోనేటి చుట్టూ రాతి పావంచాలు, గట్టు చుట్టూ నలువైపులా పదహారు దేవళాలు కట్టించారు. అందులో విశ్వనాథ దేవాలయం ఒకటి. అది కోనేరు ఉత్తరాన ఉంది. ఆ ఆలయంలో శిలలపై గల శిల్పచిత్రాకృతులు ఉండగా, మాఘ పూర్ణిమ నాడు నవ నదులకు గొప్ప అర్చన జరుగుతుంది. మాఘపూర్ణిమ నాడు… కుంభకోణంలోని కోనేరులో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, కావేరి, కృష్ణ కుమారి, పయోషిణి అనే నవ నదులు ప్రవేశిస్తాయని, అందుకే పౌర్థిమ నాడు సదరు కోనేట్లో తైర్ధికులు స్నానాలాచరించడం పరిపాటి. మఘ నక్షత్రాధిపతియైన బృహస్పతిని ఈనాడు పూజించాలని చెపుతారు. మాఘ పౌర్ణమి ద్వాపర యుగాదియని కొన్ని గ్రంథాలు చెపుతున్నాయి. ఈ పర్వదినం నాడు అరుణోదయ స్నానం, తిలపాత్ర కంచుక కంబళాది దానాలు చేయాలని, తిల హూమం, తిల దానం, తిలభక్షణం చేయాలని శాస్త్ర వచనం.
అన్ని పౌర్ణమిల్లో కల్లా మహామాఘి చాలా విశిష్టమైనది. మాఘ మాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం.
స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ, శివాలయానికి గానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు, దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుకు వివరించినట్లు పురాణ కథనం. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాలు వల్ల వ్యాధులు, చికాకుల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ”గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు” అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.
- రామకిష్టయ్య సంగనభట్ల