Australian Open | సింధుపైనే భారత్ ఆశలు..

Australian Open | సింధుపైనే భారత్ ఆశలు..

సిడ్నీ వేదికగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారత బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లలో పలువురు ఈ టోర్నీకి దూరమైన నేపథ్యంలో, అభిమానుల దృష్టి మొత్తం సింధుపైనే కేంద్రీకృతమైంది. ప్రపంచ 11వ ర్యాంకర్‌గా ఉన్న సింధు, చాలా కాలం తర్వాత మరో బీడబ్ల్యూఎఫ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు మరో ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ ఏడాది మలేషియా ఓపెన్‌లో మూడో స్థానంతో ఆకట్టుకున్నప్పటికీ, టైటిల్ మాత్రం అందలేదు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయంతో తన ఫామ్‌ను నిరూపించుకోవాలని ఆమె భావిస్తోంది.

కాగా, మ‌హిళ‌ల సింగిల్స్ తొలి రౌండ్‌లో పెరూకు చెందిన ఇనెస్ లూసియా కాస్టిల్లో సలాజర్‌ను సింధు ఎదుర్కొననుంది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు చెందిన పలువురు యువ ఆటగాళ్లు కూడా పోటీ పడనున్నారు. తన్వీ శర్మ, మాల్వికా బన్సోద్, తాన్య హేమంత్, ఆకర్షి కశ్యప్ తదితరులు తమ తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నారు. భారత మహిళల విభాగంలో మంచి పోటీ కనిపిస్తున్నప్పటికీ, పురుషుల విభాగంలో మాత్రం అనూహ్యంగా పలువురు ఆటగాళ్లు వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ 20వ ర్యాంకర్ అయుష్ శెట్టి ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడితో పాటు అనుభవజ్ఞుడైన హెచ్‌.ఎస్‌. ప్రణయ్ కూడా తన పేరును ఉపసంహరించుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ఆశలుగా భావించిన ధ్రువ్ కపిలా–తనీషా క్రాస్టో జోడీ కూడా టోర్నీకి దూరమైంది.

మహిళల విభాగంలోనూ కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్, క్వాలిఫయింగ్ రౌండ్‌లో పోటీ పడాల్సిన సామియా ఇమాద్ ఫరూఖీ కూడా టోర్నీ నుంచి వైదొలిగారు. దీంతో భారత జట్టు బలం కొంత తగ్గినట్లే కనిపిస్తోంది.

ఇక డబుల్స్ విభాగంలో హరిహరన్ అమ్సకరుణన్–అర్జున్ ఎం.ఆర్. జోడీపై అందరి దృష్టి ఉంది. ఇటీవల ఇండోనేషియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరి మంచి ప్రదర్శన చేసిన ఈ జంట, అదే జోరును ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. సూపర్-500 స్థాయి టోర్నీలో తమ తొలి టైటిల్ కోసం వారు పోరాడనున్నారు.

భారత్‌కు చెందిన మహిళల డబుల్స్ జట్లు ఈ టోర్నీలో లేకపోవడం మరో విశేషం. అయితే మహిళల సింగిల్స్‌లో సింధు, యువ షట్లర్లు మంచి ప్రదర్శన చేస్తారనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.

జూన్ 9 నుంచి 14 వరకు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ మ్యాచ్‌లు బీడబ్ల్యూఎఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ‘బీడబ్ల్యూఎఫ్ టీవీ’లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. టోర్నీ చివరి దశ మ్యాచ్‌లను జియోహాట్‌స్టార్ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. భారత అభిమానులంతా ఇప్పుడు సిడ్నీలో సింధు ప్రదర్శనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply