HYDRAA – శరవేగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ పనులు …
హైడ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైడ్రా పేరు వింటేనే అక్రమదారులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే హైడ్రాకు ప్రభుత్వం రోజురోజుకీ మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఆర్థికంగా ప్రభుత్వం ఫుల్ సపోర్టు చేస్తోంది. గతంలో హైడ్రాకు పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి రానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు.. పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయ్యాక హైడ్రాకు మరింత బలం చేకూరనుంది.
కాగా హైదరాబాద్ లోని బుద్దభవన్ లోని బి బ్లాక్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటునకు జనవరిలోనే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి ఈ పోలీస్ స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇప్పటికే హైడ్రా పోలీస్ స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అన్ని రకాల పనులు ఫిబ్రవరి చివరి వారంలోగా పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ లో కావాల్సిన సిబ్బంది గురించి కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది
అందబాటులో హైడ్రా వెబ్ సైట్, యాప్:
హైడ్రాకు ఒక పోలీస్ స్టేషనే కాక వెబ్ సైట్, మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి రానున్నాయి. హైడ్రాకు సంబంధించిన వెబ్ సైట్ , మొబైల్ యాప్ కూడా రూపొందించేందుకు ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మొబైల్ యాప్ లో చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ల వివరాలను తెలియజేయనున్నారు. దీంతో భాగ్యనగర వాసులకు ఎలాంటి స్థలం కొనాలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎక్కడ ల్యాండ్ కొనకూడదో తెలుసుకోవచ్చు. హైడ్రా పోలీస్ స్టేషన్, వెబ్ సైట్, యాప్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. మార్చి ఫస్ట్ వీక్ లో ఈ మూడు అందుబాటులోకి రానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
పైగా ప్యాలెస్ లో హైడ్రా ప్రధాన కార్యాలయం .
హైడ్రా ప్రధాన కార్యాలయానికి పైగా ప్యాలెస్ ను కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ భవంతికి సంబంధించిన మరమ్మతులను హెచ్ఎండీఏ చేపడుతోంది. పైగా ప్యాలెస్ భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ కూడా ఇచ్చింది. అయితే, ఈ మరమ్మతుల పనులు అన్నీ పూర్తి కావడానికి సంవత్సర కాలం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అలాగే రీజనల్ అఫీసులను కూడా ఏర్పాటు చేయనున్నారు.భాగ్యనగరానికి సంబంధించిన రీజినల్ కార్యాలయాన్ని బుద్ధ భవన్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాచకొండకు సంబంధించిన రీజినల్ కార్యాలయాన్ని తార్నాకలోని పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ కు సంబంధించిన రీజనల్ కార్యాలయాన్ని నానక్ రాం గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటి పనులు ప్రారంభమయ్యాయి.