ఉదయం 9 నుండి 10 గంటల వరకు కార్యక్రమం
భక్తులు నేరుగా ఈవోతో ఫోన్లో మాట్లాడే అవకాశం
సూచనలు, సలహాలు కోసం ఫోన్ నంబర్: 0877-2263261
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులతో నేరుగా మాట్లాడేందుకు మరోమారు వేదికను సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తమ అభిప్రాయాలను, సలహాలను, సమస్యలను నేరుగా టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం ఈ నెల 24 న నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహిస్తారు. టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, భక్తుల నుండి ఫోన్ ద్వారా అందే సూచనలను, అభిప్రాయాలను స్వీకరిస్తారు. టీటీడీ సేవలు, యాత్రికుల సౌకర్యాలు, ఇతర నిర్వహణాపరమైన అంశాలపై భక్తులు తమ అమూల్యమైన సలహాలను ఈవోకు నేరుగా తెలియజేయవచ్చు.
ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు 0877-2263261 అనే టెలిఫోన్ నంబర్కు డయల్ చేసి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఈ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.