TG | వేసవి విద్యుత్ డిమాండ్ త‌గ్గ‌ట్టు బొగ్గు సరఫరా చేయాలి : సీఎండీ ఎన్.బలరామ్

  • రోజుకు 2.6 లక్షల టన్నులకు తగ్గకుండా ఉత్పత్తి, రవాణా జరగాలి
  • 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి
  • నాణ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తికి ఏరియా జీఎంలు చర్యలు తీసుకోవాలి

పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతీ రోజూ 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. రోజుకు కనీసం 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని, తద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి సమీపిస్తోండటంతో దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏరియాలు కూడా ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తిని పెంచాలని సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు.

కర్ణాటక పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి వస్తున్న డిమాండ్ మేరకు రోజుకు 11 రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలని, అలాగే సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

బొగ్గు సరఫరా విషయంలో రైల్వే విభాగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. కొత్తగూడెం ఏరియా మెరుగైన ఉత్పత్తి సాధించడంపై ఏరియా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉన్న ఏరియాలు పుంజుకొని పనిచేయాలన్నారు.

బొగ్గు ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నాణ్యమైన బొగ్గును మాత్రమే వినియోగదారులకు సరఫరా చేయాలని, అలాగే ప్రతీ కార్మికుడు కూడా స్వీయ రక్షణ పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. నాణ్యత, రక్షణ విషయంలో ఏరియాలోని అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.

సమావేశంలో జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డి.ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్, జీఎం(సీపీపీ) మనోహర్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *