హైదరాబాద్, ఆంధ్రప్రభ : నకిలీ మద్యం గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. లింగంపల్లి ప్రాంతంలో ఒక బార్లో అక్రమంగా మద్యాన్ని నకిలీ చేస్తూ ఉండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న ట్రూప్స్ బార్ లైసెన్స్ పునరుద్ధరణ జరగలేదు. అంతేకాకుండా, బార్ యజమానులు బకాయి ఉన్న ఫీజును కూడా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో, రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్, ఎక్సైజ్ సిబ్బంది బార్లో తనిఖీలు నిర్వహించారు.
ఇలా వెలుగులోకి వచ్చింది…
తనిఖీల సమయంలో బార్లో కూకట్పల్లికి చెందిన సత్యనారాయణ, పునిత్ పట్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్స్ను తొలగించి, వాటిలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలుపుతూ ఉండగా అధికారులు వారిని గుర్తించారు. వారు రూ. 2690 ధర కలిగిన జెమ్సన్ బ్రాండీ బాటిల్లో రూ. 1000 ధర కలిగిన ఓక్స్మిత్ బ్రాండీని కలుపుతూ ఉండగా పట్టుబడ్డారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు బార్లో కల్తీ చేయడానికి సిద్ధంగా ఉంచిన 75 బాటిళ్ల తక్కువ ధర కలిగిన మద్యాన్ని, 55 ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో, గత కొంతకాలంగా ట్రూప్స్ బార్ యజమానులు లైసెన్స్ ఫీజు చెల్లించలేదని, అలాగే మద్యం డిపోల నుండి నేరుగా మద్యం తీసుకోవడం లేదని తేలింది. ఇతర మద్యం దుకాణాల నుండి తక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేసి, అధిక ధర కలిగిన బాటిళ్లలో నింపి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విచారణలో వెల్లడైంది.
రూ.1.48 లక్షల విలువైన మద్యం బాటిళ్ల స్వాధీనం
ఏఈఎస్ జీవన్ కిరణ్ మాట్లాడుతూ, పట్టుబడిన రూ. 1.48 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బార్ లైసెన్స్ యజమాని ఉద్యా కుమార్ రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణ రెడ్డి , బార్లో పనిచేస్తున్న ఉద్యోగి పునిత్ పట్నాయక్లపై కేసు నమోదు చేసి, వారిని లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు ఆయన తెలిపారు.