Reservation | బీసీ బంద్ను విజయవంతం చేయాలి..

Reservation | బీసీ బంద్ను విజయవంతం చేయాలి..
రిజర్వేషన్లలో బీసీలకు ద్రోహం
బీసీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారమోని నరేష్ యాదవ్
Reservation | అచ్చంపేట, ఆంధ్రప్రభ : స్థానిక ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్(42 percent reservation) కల్పించకుండా ద్రోహం చేసారని, అందుకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న బీసీ బంధ్ను విజయవంతం చేయాలని బీసీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ ఈ రోజు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇప్పుడు కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయడం బీసీ జాతికి చేసిన అవమానమని మండిపడ్డారు. 2018 కన్నా తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి, బీసీలకు దక్కాల్సిన హక్కులను ప్రభుత్వం సూటిగా తొక్కేస్తోందని, ఇది ద్వంద్వ నీతి కాదు, బీసీలపై బహిరంగ దాడి అని ఘాటుగా విమర్శించారు.
అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం 187 గ్రామ పంచాయతీలకు గాను ఎస్టీలకు 84, ఎస్సీలకు 27, అన్ రిజర్వ్డ్ పేరుతో మాధవరెడ్డి వారసులకు 64, బిసీలకు మాత్రం కేవలం 12 సీట్లు కేటాయించడం చాలా అన్యాయమని, రాజకీయంగా బీసిలను అణగద్రొక్కే ప్రయత్నం మరోసారి బహిర్గతమయ్యిందని అన్నారు. బిసిలపై రాష్ట్ర ప్రభుత్వం (State Govt) అమలు చేస్తున్న ధ్వంద్వ నీతిని ప్రజలందరికీ తెలియజేయడానికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంధ్లో పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, మేధావులు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా ఒకే వేదికపైకి వచ్చి బంధ్ను విజయవంతం చేయాలని కోరారు. బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు కల్పించే వరకు ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అయినల్ వెంకటేష్, బీసీ రాష్ట్ర నాయకులు అజయ్ యాదవ్, మహేష్ యాదవ్, శ్రీనివాస్ చారి, శ్రీను తులసి తదితరులు పాల్గొన్నారు.
