జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్లో బాల్కొండ బాలికల ప్రతిభ

బాల్కొండ, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్లో బాల్కొండ మండల బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచారు. “కిశోర బాలికల సంఘాల స్థితిగతులు – పురోగతి” అనే అంశంపై నిర్వహించిన ఈ సమావేశంలో బాల్కొండ మండలం నుండి ముగ్గురు బాలికలు పాల్గొని తమ సత్తా చాటారు.
కిసాన్ నగర్ గ్రామానికి చెందిన బి. అమృత, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన జె. అభిజ్ఞ, వి. శ్రీనిధి ఈ కార్యక్రమంలో హాజరై వివిధ సామాజిక అంశాలపై అనర్గళంగా మాట్లాడారు. వీరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కిసాన్ నగర్కు చెందిన బి. అమృత రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్కు ఎంపికైంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అమృతను ప్రత్యేకంగా అభినందించారు. బాలికల సమస్యలు,వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన అమృతను శనివారం మండల అధికారులు, ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు అభినందించారు.
