TTD | శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ !!

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారాన్ని అందించింది. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో, రాబోయే మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్లైన్ (Offline) టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల డిసెంబర్ 27, 28, 29 (శని, ఆది, సోమవారాలు) తేదీల్లో శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీ ప్రక్రియ పూర్తిగా రద్దు చేసినట్టు ప్రకటించారు అధికారులు. వరుస సెలవులు, నూతన సంవత్సర వేడుకల ముందస్తు రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల రద్దు – కౌంటర్లు మూసివేత
ఈ నిర్ణయం వల్ల తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ తో పాటు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ఉన్న కౌంటర్లో కూడా టికెట్ల జారీని నిలిపివేశారు. ఆఫ్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ మూడు రోజుల పాటు కౌంటర్ల వద్దకు రావద్దని టీటీడీ స్పష్టం చేసింది. అయితే ఆన్లైన్ ద్వారా ముందుగానే శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం యథావిధిగా దర్శనానికి అనుమతి ఉంటుంది. రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న ఈ చర్యలకు భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
