తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్కు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శివరామన్, ప్రధానార్చకులు సుందరభట్టర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చైర్మన్ పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను చైర్మన్కు అందజేశారు. కైశిక ఏకాదశిని పురస్కరించుకుని 2006వ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీవైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

