(కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ) : ప్రజా ప్రతినిధులు, జిల్లా ప్రజల సహకారంతో కర్నూలు జిల్లా (Kurnool District) ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ గా పనిచేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ గా నియమితులైన డా.ఏ.సిరి శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కర్నూలు జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ కు ఆశీస్సులు అందచేశారు..

బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ (Collector) పాత్రికేయులతో మాట్లాడుతూ… ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, అలాగే కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడం, జిల్లాలో త్రాగునీటి సమస్య ల పరిష్కారం, భూగర్భ జలాల పెంపు అంశాలపై కూడా దృష్టి పెడతామన్నారు.. ఓర్వకల్లు (Orvakallu) ఇండస్ట్రియల్ నోడ్ ద్వారా జిల్లాలో పారిశ్రమికాభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

అలాగే విద్యా రంగం అభివృద్ధి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పై కూడా దృష్టి పెడతామని, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మరమ్మతు పనులు ఏమైనా ఉంటే, వాటిని చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు… పి జి ఆర్ ఎస్ కార్యక్రమం (PGRS program) లో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.. రెవెన్యూ కు సంబంధించిన భూ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మేలు జరిగేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు..

తదనంతరం నూతన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, తదితరులు పుష్పగుచ్చాలతో జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.

