(పాడేరు/విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో ) : గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ధ్యేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. సారథ్యం యాత్రలో భాగంగా పాడేరు జిల్లాలో మాధవ్ పర్యటన కొనసాగుతుంది. ఈసందర్భంగా పాడేరు (Paderu) లో నిర్వహించిన ఛాయ్ పే చర్చలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. స్థానికుల ద్వారా గిరిజన ప్రాంతాల సమస్యలు మాధవ్ అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. దేశంలో పేదరికం నిర్మూలనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి (Andhra Pradesh Development) కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. గిరిజన ఉత్పత్తులు స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్ లు ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని మాధవ్ అభిప్రాయపడ్డారు.
బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో ఘాట్ రోడ్డు నిర్మాణంలో వేతనాలు పెంచాలని మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) నేతృత్వంలో ఉద్యమం జరిగి స్వాతంత్ర్య పోరాటంగా మారిన అంశం మాధవ్ ప్రస్తావించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలన్నారు. రాజమహేంద్రవరం నుండి పాడేరు, చింతూరు, అరకు మీదుగా విజయనగరం (Vizianagaram) జాతీయ రహదారికి అనుసంధానంగా మాడుగుల,నర్సీపట్నం ఘాట్ రోడ్డు నిర్మాణం ద్వారా రవాణా సదుపాయాలు మెరుగు పడతాయన్నారు.