ఢిల్లీ : దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ (Delhi)లోని పలు పాఠశాలలకు (Delhi schools) ఇవాళ ఉదయం ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని చాణక్యపురి (Chanakyapuri)లో గల నేవీ స్కూల్ (Navy Children School), ద్వారక (Dwarka) ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాలకు (CRPF Public School) ఇవాళ ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు పాఠశాలలకు ఫోన్ చేసిన ఆగంతకులు స్కూల్స్ ఆవరణలో బాంబులు పెట్టినట్లు బెదిరించారు.
దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రెండు పాఠశాలల్లోనూ తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.