రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేసే అవకాశం
జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
కర్నాటక, మహారాష్ట్రలో కుండపోత వానలు
ఆల్మట్టి నుంచి జూరాలమీదుగా వరదపోటు
ప్రస్తుతం జల విద్యుత్ కోసమే నీటి విడుదల
నంద్యాల, ఆంధ్రప్రభ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు తరలివస్తోంది. 15 రోజులుగా ఏగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో జలాశయం నిండుకుండలా మారింది. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,56,554 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇంతవరకు అవుట్ ఫ్లో లేదు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం 872.50 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటినిల్వ 215.7080 టీఎంసీలుకాగా ప్రస్తుతం 152.4941 టీఎంసీలుగా ఉంది. ఇక కేవలం 12.50 అడుగులు మాత్రమే జలాశయం నిండటానికి తక్కువగా ఉంది. ఈ నీరు జలాశయంలోకి వస్తే నేడో రేపో గేట్లెత్తే అవకాశం ఉన్నట్టు అధికారి వర్గాలు తెలిపాయి.
కర్నాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు..
ఏగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్రా నది పొంగి పొర్లుతుంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. ఇక.. శ్రీశైలం జలాశయంలోకి 1,56,554 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కృష్ణా పరివాహక ప్రాజెక్టులైన జూరాల నుంచి 26,072 క్యూసెక్కులు, స్పిల్ వే నుంచి 1,30,482 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సుంకేసుల హంద్రీనీవా నుంచి నీరు విడుదల కాలేదు. ఇంతవరకు విద్యుత్ ఉత్పత్తికి సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తికి 621 క్యూసెక్కుల నీటిని.. తెలంగాణకు 6904 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్టు అధికారులు తెలిపారు..