AP/TG | బిజెపి అధ్య‌క్ష ప‌ద‌వులకు నామినేషన్ వేసిన మాధవ్, రామచంద్రరావు

విజ‌య‌వాడ / హైద‌రాబాద్ – తెలంగాణ‌, ఎపిలోని బిజెపి రాష్ర్ట అధ్య‌క్ష ప‌ద‌వుల‌కు నామినేష‌న్ ప్ర‌క్రియ నేటి సాయంత్రం ముగిసింది. ఎపి బిజెపి రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వికి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామ‌చంద్ర‌రావులు త‌మ త‌మ నామినేష‌న్ లు దాఖ‌లు చేశారు.

ఇక ఎపి అధ్యక్ష పదవి నామినేష‌న్ వేసిన పీవీఎన్ మాధవ్‌కు పార్టీలో మంచి పేరుంది. గతంలో ఆయన శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ సిద్ధాంతాలపై స్పష్టమైన అవగాహన, వాగ్ధాటి ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగించాలని అధినాయకత్వం నిర్ణయించి నామినేష‌న్ వేయించింది.

తెలంగాణలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత నారపరాజు రామచందర్ రావు కు బిజెపి అథిష్టానం ఈసారి అవ‌కాశం క‌ల్పించింది.. ఎంపీలు డికె అరుణ‌, అర‌వింద్, ఈట‌ల లు ఈ ప‌ద‌వి ఆశించిన‌ప్ప‌టికీ రామ‌చంద్ర‌రావు విధేయ‌త‌కు ప‌ట్టం క‌ట్టింది.. దీంతో ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు రామచందర్‌ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఇంకా ఎన్నిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఏది ఏమైనా.. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ అధిష్టానానికి పత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు, నాయకులు, కార్యకర్తలు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని పని చేస్తానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానని రామచందర్ రావు స్పష్టం చేశారు. కాగా, ఒక్కొక్క‌రే నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో వారి ఎంపిక‌ను అధికారికంగా రేపు ప్ర‌క‌టించ‌నున్నారు.

Leave a Reply