అమరావతి – పల్నాడు జిల్లాలో (palnadu) సింగయ్య అనే వ్యక్తి మృతి వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ (jagan) చేసిన ట్వీట్ పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Hoe minister anita ) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు దారుణంగా దిగజారారని మండిపడ్డారు. అమరావతిలోని సచివాలయంలో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ నాయకుల వ్యాఖ్యలను ప్రజలు నిశితంగా గమనిస్తారని, జగన్ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు.
“పది అడుగుల రోడ్డులో (10 feet road ) ఎలా వెళ్లాలో కూడా వైసీపీ నేతలకు తెలియదా? పరామర్శ పేరుతో జగన్ రోడ్షో నిర్వహించారు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద పడినా పట్టించుకోకపోవడం అత్యంత దారుణం. గాయపడిన వ్యక్తిని దయ లేకుండా (no mercy ) పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారు. సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే బహుశా ఆ వ్యక్తి ప్రాణాలు దక్కేవేమో. జగన్కు రాజకీయ లబ్ధి తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇద్దరు వ్యక్తులు చనిపోయినా జగన్ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు” అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
“చేసిన తప్పును సమర్థించుకోవడం ఇంకా దారుణం. జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు. సత్యసాయి జిల్లాకు వెళ్లినప్పుడు కూడా రచ్చరచ్చ చేశారు. పొదిలి వెళ్లినప్పుడు మహిళలు, పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. రెంటపాళ్లకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. పరామర్శకు ఎలా వెళ్లాలో 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి తెలియదా? కేవలం బలప్రదర్శన చేయడానికే జగన్ బయటకు వస్తున్నట్లుంది. రప్పా రప్పా అంటే తప్పేంటని అడగడం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తోంది” అని అనిత విమర్శించారు.
జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో స్థానం లేదని, హింసను ప్రేరేపించేలా మాట్లాడటం ఆయనకు తగదని హోంమంత్రి అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు సహాయం చేస్తారని, గాయపడిన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలిస్తారని గుర్తుచేశారు. “ఏదో వాహనం ఢీకొందన్న సమాచారం మేరకే ఎస్పీ తొలుత అలా మాట్లాడారు. కానీ, వీడియోలు చూసిన తర్వాత కేసును మార్చామని అదే ఎస్పీ స్పష్టం చేశారు కదా” అని అనిత వివరించారు.
కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిని జగన్ అవలంబిస్తున్నారని మంత్రి అనిత ఆరోపించారు. “గతంలో మేం ఆంక్షలు విధించామా?’ అని ఎదురు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. మీరు చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడటం దారుణం. ఐదేళ్లపాటు ప్రతిపక్ష నాయకులను రోడ్డు మీదకు రానిచ్చారా? ట్వీట్లు, మీడియా సమావేశాల్లో జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే” అని మంత్రి అనిత తీవ్రంగా విమర్శించారు.