Counter | ఐశ్వ‌ర్య‌పై బాడీ షేమింగ్ కామెంట్స్…ధీటుగా బ‌దులిచ్చిన మాజీ ప్ర‌పంచ సుంద‌రి ..

ముంబ‌యి – అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత అందాన్ని చాటిచెప్పారు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నుదుటన సిందూరం ధరించి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, కొంతకాలంగా తన శరీరాకృతి, బరువు పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై ఐశ్వర్య తాజాగా గట్టిగా స్పందించారు.

ఆరాధ్య జన్మించిన తర్వాత ఐశ్వర్య రాయ్ బరువు పెరిగారంటూ గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆమె బాడీ షేమింగ్‌కు కూడా గురయ్యారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఐశ్వర్య, ఇప్పుడు ఆ విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “నేను బరువు పెరిగితే మీకొచ్చిన సమస్య ఏంటి? కూతురు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగానా లేక ఒంటికి నీరు పట్టిందా అనే దానిపై మీకెందుకంత ఆసక్తి? అది నేను చూసుకుంటాను కదా,” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

తన బరువు తనకు ఎప్పుడూ సమస్య కాదని, ప్రస్తుతం తాను సంతోషంగా తన కుమార్తెను చూసుకుంటున్నానని ఐశ్వర్య స్పష్టం చేశారు. “నా బరువుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోగలను. కానీ నాకు ఆ అవసరం ఇప్పుడు లేదు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు,” అని ఆమె తేల్చి చెప్పారు.

Leave a Reply