AP | బుడమేరుకు స‌మాంత‌రంగా కొత్త ఛానెల్ – మంత్రి నిమ్మ‌ల

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): బుడమేరు రిటైనింగ్ వాల్ ను జూన్ 10వ తేదీ నాటికి సేఫ్టీ లైన్ కు తీసుకు రావాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతంలో రూ.28 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి మంత్రి నిమ్మల బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో అత్యవసరంగా పూడ్చిన గండ్లు ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. సీజన్ ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా, పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసేలా డీపీఆర్ తయారీ దశలో ఉందని చెప్పారు.
బుడమేరు ఓల్డ్ ఛానెల్ కు సమాంతరంగా మరొక కొత్త ఛానెల్ ను కూడా 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రతిపాదనలు తయారు చేసినట్లు వివరించారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలను సమన్వయం చేసి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ పరిధిలో కథ ఏడాది సంబంధించిన వరదల ఉధృతికి చాలా చోట్ల చెరువులు వాగులకు గండ్లు పడ్డాయని వాటిని కూడా తక్షణమే పూడ్పించాలని మంత్రి నిమ్మలను కోరారు. గతంలో చేసిన పనులు కూడా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన రావు (గాంధీ), జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

గండ్లు పూడ్చేందుకు నిధులు కేటాయించండి – ముఖ్యమంత్రికి వసంత వినతి

బుడమేరు అభివృద్ధితో పాటు గత ఏడాది ఆకస్మిక వరదల వల్ల మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న వాగులు, చెరువులు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వసంత స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. గత ఏడాది సంభవించిన వరదల బీభత్సానికి మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిందన్నారు. అప్పట్లో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. దీనివల్ల కోతుల వాగు, పులి వాగు ఒక్కసారిగా పొంగి పొర్లాయన్నారు. ఈ వాగులన్నీ బుడమేరులో కలుస్తాయని, వీటితో పాటు 50కి పైగా చెరువుల కట్టలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలు, వాగులు, వంకలు చాలాచోట్ల గండ్లు పడి తెగిపోయాయని చెప్పారు.

బుడమేరు 70 శాతానికి పైగా మైలవరం నియోజకవర్గంలో ఉందన్నారు దీనికి అనుబంధంగా కోతుల వాగు, పులి వాగులు కూడా ఇక్కడే ఉన్నాయన్నారు. గత ఏడాది ఆకస్మిక వరదల వల్ల గ్రామాలకు, పొలాలకు రక్షణగా ఏర్పాటు చేసిన కరకట్టలు పూర్తిగా కొట్టుకుపోయాయన్నారు. ఈ వాగులు పొంగిన కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా 50కి పైగా చెరువులు పూర్తిగా తెగిపోయాయని చెప్పారు. వీటన్నింటికీ మరమ్మతులు, వాగులు, చెరువులు, సాగర్ కాలువల అభివృద్ధికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికన పూడ్చిన గండ్ల పనులకు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. బుడమేరును దానికి అనుబంధంగా ఉన్న కాలువలు, వాగులు, చెరువులను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మైలవరం నియోజకవర్గంలో సాగునీటి పారుదల వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి పరిపూర్ణంగా నిధులు కేటాయించాలని కోరారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబుకు వివరించినట్లు ఎమ్మెల్యే వసంత వెల్లడించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన మీడియాకు వివరించారు.

Leave a Reply