-20.6 కేజీల గంజాయి, కారు స్వాధీనం..
సంగారెడ్డి ప్రతినిధి, మే 9 (ఆంధ్రప్రభ) : మహారాష్ట్ర ఔరంగబాద్లోని ఒక కంపెనీలో అపరేటర్గా పని చేస్తున్న వ్యక్తి వస్తున్న జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడు. రెండేళ్లుగా ఉద్యోగంతో పాటు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. 2023లో ఒకమారు గంజాయి రవాణా చేస్తూ అబుల్లాపూర్ మెట్లో ఒకసారి పట్టుబడ్డాయి. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. ఐనా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్టిఎఫ్ ఏ టీమ్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ అనే వ్యక్తి సీలేరు నుంచి గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తూ ఉంటాడు. లక్ష్మీబాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయిని తీసుకొని జాతీయ రహదారి 65లో సంగారెడ్డి పోతురెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్మెంట్ ప్రాంతంలో కారులో వెళ్తుండగా గంజాయిని ఎస్టి ఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి టీమ్, సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసుల్లో గంజాయిని కొనుగోలు చేసి అమ్మకాల కోసం తీసుకెళ్తున్న జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్, గంజాయి అమ్మకాలు జరిపిన లక్ష్మీబాయి, కృష్ణ కొన అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కారు, గంజాయిలను స్వాధీనం చేసుకొని, నిందితుడు జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ అరెస్టు చేసి సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్టి ఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజి రెడ్డి తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు.