పీజీఆర్ఎస్‌పై ప్రజల స్పందనకు ప్రత్యేక క్యూఆర్ కోడ్

  • ఆగస్టు 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం, ఆగస్టు 17న ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఆగస్టు 17న విజయవాడ కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతులను అధికారులకు సమర్పించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా పీజీఆర్ఎస్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలనే ఉద్దేశంతో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లోనూ సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి వినతులను స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ ప్రాంతానికి సమీపంలోని పీజీఆర్ఎస్ కేంద్రాన్ని వినియోగించుకుని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.

పీజీఆర్ఎస్ సేవలపై స్పందనకు ప్రత్యేక క్యూఆర్ కోడ్

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మరింత ప్రజా స్నేహపూర్వకంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అర్జీదారుల స్పందన కోసం ప్రభుత్వం ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు పీజీఆర్ఎస్ సేవలను పొందిన అనంతరం తమ మొబైల్ ఫోన్ ద్వారా ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సేవలపై తమ అభిప్రాయాలు, సూచనలు, స్పందనను తెలియజేయవచ్చని వివరించారు.

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు..

ప్రజలు కార్యాలయాలకు నేరుగా వచ్చి వినతులు సమర్పించడంతో పాటు, తమ సమస్యలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అర్జీల స్థితిగతులు, పరిష్కార ప్రక్రియకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అందిస్తున్న పీజీఆర్ఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కోరారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే పీజీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమని, ప్రజల స్పందన, సూచనలు ఈ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.