India Myanmar Thailand Highway-IMT-1360 km Road | ‘యాక్ట్ ఈస్ట్’కు ఊపిరి… ఆసియా ఆర్థిక కారిడార్‌

India Myanmar Thailand Highway-IMT-1360 km Road | ఆంధ్రప్రభ వెబ్, జాతీయ ప్ర‌తినిధి: మణిపూర్‌లోని సరిహద్దు పట్టణం మోరెహ్ నుంచి కారులో బయలుదేరితే, మయన్మార్‌లోని పర్వతాలు, మండలే చారిత్రక నగరం, నేపిడా రాజధాని దాటి నేరుగా థాయ్‌లాండ్‌లోని మే సోట్ చేరుకోవచ్చు. ఇదే కలను నిజం చేయబోతున్న ప్రాజెక్టు ఇండియా–మయన్మార్–థాయ్‌లాండ్ (IMT) ట్రైలేటరల్ హైవే. దాదాపు 1,360 కిలోమీటర్ల పొడవైన ఈ అంతర్జాతీయ రహదారి కేవలం ప్రయాణానికే కాదు… భారత్‌ వాణిజ్యం, పర్యాటకం, వ్యూహాత్మక భద్రత, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కొత్త దిశను చూపే మెగా కనెక్టివిటీ కారిడార్‌గా భావిస్తున్నారు.

ఐఎంటీ హైవే అంటే ఏమిటి?

ఈ ప్రాజెక్టు భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ మూడు దేశాల సంయుక్త కనెక్టివిటీ కార్యక్రమం. రహదారి మణిపూర్‌లోని మోరెహ్ నుంచి ప్రారంభమై మయన్మార్‌లోని టాము – కలేవా – యాగీ – మండలే – నేపిడా – బాగో మీదుగా థాయ్‌లాండ్‌లోని మే సోట్ వరకు వెళ్తుంది. 2002లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో భారత్ ప్రధాన భాగస్వామిగా రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టింది.

కీల‌కం ఎందు కంటే !

భారత్‌కు ఆగ్నేయాసియాతో సముద్ర మార్గాలు ఉన్నా, భూభాగం ద్వారా నేరుగా వెళ్లే ఆధునిక రహదారి లేదు. ఈ హైవే పూర్తయితే ASEAN దేశాలతో భారత అనుసంధానం మరింత బలపడుతుంది.

  • లాజిస్టిక్స్ ఖర్చు తగ్గింపు
  • వస్తువుల రవాణా వేగంగా, తక్కువ వ్యయం
  • కొత్త మార్కెట్లు
  • ఈశాన్య రాష్ట్రాలకు ASEAN మార్కెట్లు అందుబాటులోకి వ‌స్తాయి
  • రోడ్ ట్రిప్స్, బౌద్ధ పర్యాటకానికి భారీ అవకాశం
  • సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, భద్రతకు ఊతం

ఈశాన్య భారతానికి ‘గేట్‌వే’ ఎలా?

ప్రస్తుతం మణిపూర్, మిజోరం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు సరుకు తరలించాలంటే సముద్ర మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఐఎంటీ హైవేతో భూభాగం ద్వారానే ట్రక్కులు నేరుగా థాయ్‌లాండ్ చేరే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు వేగంగా ఎగుమతి చేయవచ్చు. చిన్న పరిశ్రమలకు విదేశీ మార్కెట్లు చేరువ అవుతాయి. సరిహద్దు వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చెందుతాయి.
ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.

యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఇదే వెన్నెముక

భారత్ ప్రకటించిన యాక్ట్ ఈస్ట్ పాలసీ లక్ష్యం తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం. ఐఎంటీ హైవే ఆ లక్ష్యానికి అత్యంత కీలక మౌలిక వసతి. భవిష్యత్తులో ఈ కారిడార్‌ను లావోస్, కంబోడియా, వియత్నాం వరకు విస్తరించే ప్రణాళిక కూడా ఉంది. అలా జరిగితే భారత్ నుంచి ఇండోచైనా ప్రాంతం వరకు నిరంతర భూసంబంధం ఏర్పడుతుంది.

మరి ఆలస్యం ఎందుకు?

ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి ప్రధాన కారణం మయన్మార్‌లోని రాజకీయ, భద్రతా పరిస్థితులు. అక్కడ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల వల్ల రహదారి నిర్మాణం, వంతెనల పనులు పలుమార్లు నిలిచిపోయాయి. అయినా 2026లో భారత్–మయన్మార్ ద్వైపాక్షిక సమావేశాల్లో ఈ హైవేను పూర్తి చేయాలని ఇరు దేశాలు మరోసారి సంకల్పం ప్రకటించాయి. కలాదాన్ మల్టీమోడల్ ప్రాజెక్టుతో పాటు IMT హైవేకు కూడా ప్రాధాన్యం ఇచ్చాయి.

భారత్‌కు దక్కే ఆర్థిక లాభం ఎంత?

నిపుణుల అంచనాల ప్రకారం ఈ హైవే పూర్తయితే భారత్–ASEAN వాణిజ్యానికి కొత్త ఊపు లభిస్తుంది. ప్రస్తుతం ASEAN భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. రవాణా సమయం తగ్గడం వల్ల సప్లై చైన్ మరింత సమర్థవంతంగా మారుతుంది. ఈ దిగువ‌ రంగాలకు భారీ అవకాశాలు ఏర్పడవచ్చు.

  • ఆటోమొబైల్ విడిభాగాలు
  • వ్యవసాయ ఉత్పత్తులు
  • ఔషధాలు
  • టెక్స్‌టైల్ ఉత్పత్తులు
  • ఎలక్ట్రానిక్ వస్తువులు

ఆసియాను కలిపే ఆర్థిక కారిడార్
ఐఎంటీ ట్రైలేటరల్ హైవే సాధారణ రహదారి ప్రాజెక్టు కాదు. ఇది భారత్‌ను ఆగ్నేయాసియాతో భూభాగం ద్వారా అనుసంధానించే తొలి పెద్ద అంతర్జాతీయ కారిడార్. ఈశాన్య భారతాన్ని అభివృద్ధి కేంద్రంగా మార్చడంతో పాటు, ASEAN దేశాలతో వాణిజ్యం, పర్యాటకం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే సామర్థ్యం దీనికి ఉంది. హైవే పూర్తయిన రోజు… “భారత్ నుంచి కారులో థాయ్‌లాండ్” అనేది కల కాదు, నిజమైన ప్రయాణ మార్గంగా మారే అవకాశం ఉంది.