మహిళలు, చిన్నారుల రక్షణపై అవగాహన అవసరం

ఏలూరు, ఆంధ్రప్రభ: మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని ఏలూరు వన్‌టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణ అన్నారు. మహిళల భద్రత, బాలికల రక్షణ, సామాజిక చైతన్యం, సైబర్‌ నేరాల నివారణపై ఏలూరులోని శ్రీ భారతి పాఠశాలలో మంగళవారం విద్యార్థినీ, విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్‌ శివకిషోర్‌ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌ సూచనలతో వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహిళల రక్షణకు చట్టాలపై అవగాహన

మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, గృహహింస తదితర నేరాల నుంచి రక్షణ పొందేందుకు ఉన్న చట్టాలు, సమస్య ఎదురైనప్పుడు పోలీసులను ఎలా ఆశ్రయించాలనే అంశాలను విద్యార్థులకు వివరించారు. తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఆపదలో 112.. శక్తి బృందాల సహాయం

ఆపద సమయంలో మహిళలు, బాలికలు పోలీసుల సహాయం పొందేందుకు 112 అత్యవసర సేవలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. ఏలూరులో మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉండే శక్తి బృందాల పనితీరు, వాటి ద్వారా పొందగలిగే సహాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై అవగాహన

చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టం గురించి పోలీసులు వివరించారు. ముఖ్యంగా గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ మధ్య తేడాను పిల్లలు తెలుసుకోవాలని సూచించారు. తమకు అసౌకర్యంగా అనిపించే స్పర్శ లేదా ప్రవర్తన ఎదురైతే మౌనంగా ఉండకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

అపరిచిత వ్యక్తులతో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే భయపడకుండా నమ్మకమైన పెద్దలకు విషయం చెప్పాలని తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు వద్దు

పెరుగుతున్న సైబర్‌ నేరాలపై కూడా విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్‌ వివరాలు, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.

సైబర్‌ వేధింపులు, ఆన్‌లైన్‌ మోసాలు లేదా ఇతర సైబర్‌ నేరాలకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. సైబర్‌ మోసాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 సైబర్‌ నేరాల సహాయవాణిని సంప్రదించాలని సూచించారు.

పిల్లల భద్రతలో తల్లిదండ్రులదీ బాధ్యతే

పిల్లల ప్రవర్తనలో ఇంట్లో, పాఠశాలలో లేదా బయట అనూహ్యమైన మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలని కోరారు.

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమకు తెలిసిన విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసి సామాజిక చైతన్యం పెంపొందించాలని పోలీసులు సూచించారు.

కార్యక్రమంలో శ్రీ భారతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, శక్తి బృందం సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్‌ నేరాల నివారణపై నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగకరంగా నిలిచింది.