భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాన్షు శుక్లా మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించనున్నారు.
ఆక్సియమ్ మిషన్ 4 (ఏఎక్స్ – 4)లో భాగంగా మే 29న రాత్రి 10:33 గంటలకు ఫ్లోరిడా నుంచి స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్ షిప్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.
ఈ మిషన్ను ఇస్రో, నాసా, స్పేస్ఎక్స్, ఆక్సియమ్ స్పేస్ సంయుక్తంగా చేపడుతున్నాయి. కాగా, భారతదేశ అంతరిక్ష ఆశయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ మిషన్ కీలకమైన అడుగు కానుంది.
నాసాకు చెందిన అనుభవజ్ఞుడైన వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వంలోని Ax-4 మిషన్లో పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములతో కలిసి శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు.
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో వారు 14 రోజుల పాటు గడపనున్నారు. ఈ మిషన్ లో భాగంగా గగన్యాన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్కు కీలకమైన సైనోబాక్టీరియాను పరీక్షించడం వంటి శాస్త్రీయ ప్రయోగాలలో పాల్గొంటారు.