గద్వాల (ప్రతినిధి) ఏప్రిల్ 29 (ఆంధ్రప్రభ) : గద్వాల జిల్లా కేంద్రంలో నర్సింగ్ కాలేజీ విద్యార్థినీలు కాలేజీ ముగిసిన తర్వాత హాస్టల్ కు వెళ్లేందుకు కొత్త హౌసింగ్ బోర్డ్ టర్నింగ్ బస్టాప్ దగ్గర బస్సు కోసం ఆగారు. అంతలో ఓ వాహనం వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో మక్తల్ కు చెందిన మహేశ్వరి, వనపర్తికి చెందిన మనిషా స్పాట్ లోనే మృతి చెందారు.
మరో ఇద్దరు విద్యార్థినీలతో పాటు మరో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనను తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ టి.శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ లు ప్రమాద సంఘటనను పరిశీలించారు. అనంతరం హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
