ఐసీసీ కొత్త ఫార్మాట్పై అసంతృప్తి..
- ఆటగాళ్లను ఎందుకు అడగలేదంటూ డబ్ల్యూసీఏ
- ఐసీసీని నిలదీసిన క్రికెటర్ల సంఘం
- చిన్న దేశాలకు అన్యాయమా?..
- అసోసియేట్ జట్ల అవకాశాలు తగ్గిస్తున్నారంటూ ఐసీసీపై విమర్శలు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో మార్పులు చేయడంపై ప్రపంచ క్రికెటర్ల సంఘం (డబ్ల్యూసీఏ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీరును ప్రశ్నించింది. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఆటగాళ్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరమని పేర్కొంది.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2027 వన్డే ప్రపంచకప్లో 14 జట్లే పాల్గొంటున్నప్పటికీ, అర్హత సాధించిన జట్లలో అత్యల్ప ర్యాంకింగ్లో ఉన్న మూడు జట్ల కోసం కొత్తగా ‘సూపర్ సిరీస్’ దశను ఐసీసీ ప్రవేశపెట్టింది. ఈ మూడు జట్లలో ఒకటి మాత్రమే ప్రధాన గ్రూప్ దశకు చేరేలా నిబంధనలు మార్చింది. దీంతో ప్రపంచకప్కు అర్హత సాధించినా అన్ని జట్లకు సమాన అవకాశాలు ఉండవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచ క్రికెటర్ల సంఘం ప్రధాన కార్యనిర్వాహక అధికారి టామ్ మోఫాట్ మాట్లాడుతూ, ప్రపంచ టోర్నీల రూపకల్పనపై నిర్ణయం తీసుకునే హక్కు ఐసీసీకి ఉన్నప్పటికీ, అర్హత ప్రక్రియ పూర్తయ్యాక ఇలాంటి కీలక మార్పులు చేసే ముందు సభ్య దేశాలు, ఆటగాళ్లతో పారదర్శకంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను విస్తరించాలని ఒకవైపు చెబుతూ, మరోవైపు చిన్న దేశాల అవకాశాలను తగ్గించే నిర్ణయాలు తీసుకోవడం పరస్పర విరుద్ధమని వ్యాఖ్యానించారు.
నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా ఈ నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేశారు. ప్రపంచకప్కు అర్హత సాధించడం ఏ దేశానికైనా గొప్ప విజయమని, ఏళ్ల తరబడి చేసిన ప్రణాళికల తర్వాత టోర్నీ నిర్మాణాన్ని మార్చడం తీవ్ర నిరాశ కలిగిస్తుందని అన్నారు. అసోసియేట్ దేశాలకు ప్రపంచ అగ్రశ్రేణి జట్లతో పోటీ పడే అవకాశాలు మరింత తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ మాట్లాడుతూ, చిన్న దేశాలు ప్రపంచ టోర్నీలకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తాయని అన్నారు. ఇటీవల జరిగిన ఫుట్బాల్ ప్రపంచకప్లో చిన్న దేశాల ప్రదర్శన అందుకు నిదర్శనమని పేర్కొంటూ, క్రికెట్లోనూ అలాంటి అవకాశాలను విస్తరించే దిశగా ఐసీసీ ఆలోచించాలని సూచించారు.
కొత్త ఫార్మాట్పై ఇప్పటికే పలు దేశాల ఆటగాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, ఈ అంశంపై ఐసీసీ మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
