Narendra Modi | మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ..
ఇండో–పసిఫిక్ వ్యూహంపై కీలక చర్చలు
జూలై 6–11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటన
ద్వైపాక్షిక సంబంధాలు, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రవాస భారతీయులతో భేటీలకు ప్రాధాన్యం
Narendra Modi | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (జూలై6) నుంచి జూలై 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక సహకారం, వాణిజ్య, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అంశాలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.
మోదీ తొలి విడతలో జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, సముద్ర భద్రత, ఇండో–పసిఫిక్ ప్రాంతీయ సహకారం, సరఫరా గొలుసుల బలోపేతం, వాణిజ్యం, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. రక్షణ సహకారానికి సంబంధించిన అంశాలు, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు అవకాశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
2016 తర్వాత ప్రధాని మోదీ ఇండోనేషియాను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా జకార్తాలోని ప్రవాస భారతీయులతో ఆయన సమావేశమై వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రాంబనన్ హిందూ ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంది.
ఇండోనేషియా పర్యటన అనంతరం ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి, వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంకేతిక రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ముఖ్య కార్యనిర్వాహకులతో సమావేశమై పెట్టుబడి అవకాశాలపై చర్చించే కార్యక్రమం ఉంది.
చివరగా ప్రధాని న్యూజిలాండ్లోని ఆక్లాండ్ను సందర్శిస్తారు. భారత ప్రధాని హోదాలో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్ను సందర్శిస్తున్న ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరపడమే కాకుండా, ప్రవాస భారతీయుల సభలో పాల్గొని వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రత, ఆర్థిక సహకారం వంటి అంశాల నేపథ్యంలో ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనతో భారత్–ఇండో–పసిఫిక్ భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
