టీమిండియాకు భారీ షాక్..!

  • చరిత్ర సృష్టించిన ఐర్లాండ్..
  • 34 పరుగుల తేడాతో భారత్‌పై తొలి విజయం..
  • శ్రేయస్ కెప్టెన్సీకి చేదు ఆరంభం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అనూహ్యంగా తడబడింది. 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటై 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. మరోవైపు ఐర్లాండ్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి భారత్‌ను ఓడించింది ఐర్లాండ్. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లో 50 పరుగులు చేసి భారత అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు.

అయితే అతడు అవుట్ అయిన వెంటనే భారత బ్యాటింగ్ కుప్పకూలింది. అరంగేట్రం చేసిన జై మూంద్రా తన తొలి అంతర్జాతీయ బంతికే సంజూ శాంసన్‌ (5)ను బౌల్డ్ చేశాడు. మరో అరంగేట్ర బౌలర్ మ్యాట్ హోలార్డ్ ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3)లను పెవిలియన్‌కు పంపి భారత్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు.

మధ్యలో శివమ్ దూబే 25 పరుగులతో పోరాడినా, మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడిపోవడంతో భారత్ మ్యాచ్‌లో వెనుకబడింది. అక్షర్ పటేల్ 15 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. చివర్లో హర్షిత్ రాణా (8), అర్ష్‌దీప్ సింగ్ (2) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు.

ఐర్లాండ్ బౌలర్లలో మ్యాథ్యూ హంఫ్రీస్ 3 వికెట్లు, మ్యాట్ హోలార్డ్ 3 వికెట్లు, జై మూంద్రా 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కుదేలు చేశారు. గారెత్ డెలానీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ లార్కన్ టక్కర్ (50) అర్ధ సెంచరీ సాధించగా, గారెత్ డెలానీ 49 పరుగులతో మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ నిలబెట్టుకోవాలంటే భారత్‌కు రెండో టీ20లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.