మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘనంగా 3వ కాన్వొకేషన్ వేడుకలు
మేడ్చల్, ఆంధ్రప్రభ: మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బుధవారం 3వ కాన్వొకేషన్ డే (గ్రాడ్యుయేషన్ డే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. విశిష్ట ప్రతిభ కనబరిచిన టాపర్లకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మల్లారెడ్డి, లక్ష్యాలను ముద్దాడుతూ భవిష్యత్తును జయించాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నేటి పోటీ ప్రపంచంలో నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల ఉన్నవారికే విజయం దక్కుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థుల ఆనందోత్సాహాలతో యూనివర్సిటీ క్యాంపస్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
