High Voltage | ఇవాళ దాయాదుల సమరం
High Voltage | ఇవాళ దాయాదుల సమరం
High Voltage | ఐసీసీ మహిళల వరల్డ్ కప్లో భారత్, పాక్ ఢీ
ఫేవరెట్గా హర్మన్ప్రీత్సేన
రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
High Voltage | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ఆదివారం తలపడనున్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజకీయ కారణాలతో భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. దీంతో ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అదే కారణంగా ఈ మ్యాచ్పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. టోర్నీలో ఇరు జట్లకూ ఇదే తొలి మ్యాచ్ కావడం మరో విశేషం.
గత ఏడాది వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన విజయంతో టోర్నీని ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత జట్టులో స్మృతి మంధాన, షెఫాలి వర్మల రూపంలో దూకుడైన ఓపెనర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించనున్నారు. రిచా ఘోష్ ఫినిషర్గా, దీప్తి శర్మ ఆల్రౌండర్గా జట్టుకు బలంగా నిలుస్తున్నారు. స్పిన్ విభాగంలో శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్ అదనపు బలంగా ఉన్నారు.

అయితే భారత జట్టుకు ఓపెనర్ల ఫామ్ కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల స్మృతి మంధాన, షెఫాలి వర్మలు నిలకడైన ప్రదర్శన చేయలేకపోయారు. పాకిస్థాన్పై భారీ స్కోరు సాధించాలన్నా, లక్ష్యాన్ని ఛేదించాలన్నా ఈ ఇద్దరి నుంచి శుభారంభం అవసరం. మరోవైపు పాకిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. కెప్టెన్ ఫాతిమా సనా ఆల్రౌండ్ ప్రదర్శన, ఆలియా రియాజ్, ముబీనా అలీల బ్యాటింగ్ ఆ జట్టుకు కీలకం కానున్నాయి. అయితే ఇంగ్లాండ్ పిచ్లపై పాకిస్థాన్ బౌలర్లు ఎంత మేర ప్రభావం చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇరు జట్ల మధ్య గత రికార్డులు పరిశీలిస్తే భారత్దే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. మహిళల టీ20ల్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్ 13 విజయాలు నమోదు చేయగా, పాకిస్థాన్ కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. 2024లో దుబాయ్లో జరిగిన చివరి ప్రపంచకప్ మ్యాచ్లోనూ భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది.ఈ నేపథ్యంలో మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న హర్మన్ప్రీత్ సేన దాయాది జట్టుపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేక పాకిస్థాన్ సంచలనం సృష్టిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
రికార్డుల్లో మనదే పైచేయి
దాయాదులో పోరులో భారత్దే స్పష్టమైన ఆధిక్యం. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్ 13-3తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 2024 దుబాయ్ ప్రపంచకప్లో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది.
తుది జట్లు (అంచనా )
ఇండియా
స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), భార్తీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్/నందని శర్మ, శ్రీ చరణి, రేణుక సింగ్, క్రాంతి గౌడ్.
పాకిస్థాన్
గుల్ ఫెరోజా, ముబీనా అలీ, నటాలియా, ఆలియా రియాజ్, ఫాతిమా సనా (కెప్టెన్), సైరా జబీన్, ట్యూబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మరో మ్యాచ్లో నెదర్లాండ్స్తో బంగ్లాదేశ్ తలపడనుంది.

