Amarnath Yatra Security | అమర్‌నాథ్ యాత్ర భద్రతపై అమిత్ షా సమీక్ష

Amarnath Yatra Security | అమర్‌నాథ్ యాత్ర భద్రతపై అమిత్ షా సమీక్ష

న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం
భద్రత, యాత్రికుల సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు

Amarnath Yatra Security | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమర్‌నాథ్ యాత్ర భద్రత, సన్నాహాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న ఈ వార్షిక యాత్రకు ఎలాంటి అంతరాయం లేకుండా, భద్రతాపరమైన ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన చర్చించారు.

భద్రతను పటిష్టం చేయడం కోసం పెద్ద సంఖ్యలో పారామిలటరీ బలగాలను అందుబాటులో ఉంచే అంశానికి హోంశాఖ ఆమోదం తెలిపింది. యాత్ర మార్గాల్లో అక్రమ ప్రవేశాలను నివారించడానికి క్యూఆర్-కోడ్ ఆధారిత ‘పెహ్‌చాన్ యాప్’ (Pahchan App) ద్వారా కార్మికులు, విక్రేతలను డిజిటల్‌గా వెరిఫై చేస్తున్నారు. పహల్గామ్, బాల్టాల్ మార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల మధ్య సమన్వయం ఉండేలా వ్యూహాలు రూపొందించారు. భద్రతతో పాటు యాత్రికులకు అవసరమైన వైద్యం, వసతి, తాగునీరు, రవాణా ఏర్పాట్లపై కూడా దృష్టి సారించారు.

ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, హోం సెక్రటరీ, ఐబీ డైరెక్టర్, ఆర్మీ చీఫ్, సీఆర్పీ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ డైరెక్టర్ జనరల్స్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Leave a Reply