మహిళపై ఎలుగుబంటి దాడి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ మండల పరిధిలోని కొండనాగుల ఈస్ట్ బీట్ పవనకుంట ప్రాంతంలో ఆదివారం ఎలుగుబంటి దాడి ఘటన కలకలం రేపింది. చెంచుగూడెం గ్రామానికి చెందిన నిమ్మల సాలమ్మ (భర్త: నిమ్మల రాములు) మేకల కాపలాకు అడవికి వెళ్లిన సమయంలో పిల్లలతో సంచరిస్తున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఈ ఘటనలో సాలమ్మ తీవ్రంగా గాయపడగా, అక్కడికక్కడే కుప్పకూలింది.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లేశం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రాజు, మీనాక్షి వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గాయపడిన మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అచ్చంపేటలోని మహదేవ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

అడవిలో ఎలుగుబంట్లు, పులులు, చిరుతలు సంచరిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తప్ప అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా పశువులు, మేకలు, గొర్రెల మేపు, కట్టెల సేకరణ కోసం అడవిలోకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అడవి జంతువులు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బాధితురాలికి అటవీశాఖ తరఫున రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

Leave a Reply