Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం Andhra Prabha Assembly News

Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం Andhra Prabha Assembly News
- అమరావతే శాశ్వత రాజధాని
- బీజేపీ సంపూర్ణ మద్దతు
- 2019లో వైరస్ పీడించింది
- ఆయన మాట్లాడితే…
- నల్లమల భస్మీపటలం
- వైఎస్ జగన్ పై మంత్రి సెటైర్
- మధ్యలో అత్తారింటికి దారేది కథ
- సీఎం సహా సభ్యుల నవ్వుల జల్లు
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)

రాష్ట్రంలో మళ్లీ 12 ఏళ్ల తరువాత రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధత గురించి చర్చించాల్సి రావడం దురదృష్టకరమని భాజపా జాతీయ నాయకుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా శనివారం జరిగిన రాష్ట్ర శాసనసభలో మంత్రి మాట్లాడుతూ చారిత్రాత్మక తీర్మానానికి సంపూర్ణ మద్దతును బీజేపీ తరపున తెలియచేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి సత్యకుమార్ ప్రసంగం సూటిగా. స్పష్టంగా భావో ద్వేగంతో గత వైసీపీ పాలనలోని దురాగతాలను ఎండగడుతూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రసంగం సాగింది.
Bjp Support : కేంద్రం పూర్తి సహకారం…!

“ఈరోజు సంతోషకరమైన రోజు. దురదృష్టకర రోజు కూడా అని భావిస్తున్నా. అమరావతి కులాలు, మతాలకు పరిమితమైన రాజధాని కాదు ప్రాంతాలకు అతీత రాజదాని భవిష్యత్తులో ఎవరైనా విధ్వంసకర, వికృత, వినాసకర మనస్తత్వం కలిగిన వారి వల్ల ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు చట్టబద్ధంగా తీర్మానం చేయాలని సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది. దురదృష్టకరమైన రోజు అని ఎందుకు అన్నానంటే 12 ఏళ్ల కిందట 20వేల మంది రైతులు 33వేల ఎకరాలను పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా రాజధాని నిర్మాణానికి గొప్ప మనసుతో ఉదారత్వంతో అప్పగించారు. సీఎం. చంద్రబాబునాయుడు లక్ష్యం మేరకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ విద్యా సంస్థలు, ఇతర సంస్థలను కేంద్రం మంజూరుచేసింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు సైతం అమలుచేస్తున్నారు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించి 100% నిదులను కేంద్రం ఇస్తోంది. అమరావతికి గ్రోత్ ఇంజన్ గా ఉండేందుకు 189 కిలోమీటర్ల అవుటర్ రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చింది.
Bjp Support : 2019 వైరస్ తో కకావికలం!

2019లో ఓ వైరస్ రాష్ట్రానికి వచ్చింది నాటి పాలనలో విధ్వంసకర, వినాసకర నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి ఘోరంగా దెబ్బతినింది. దేశ ప్రధాని మోదీ 2015లో అమరావతి రాజధాని నిర్మాణానికి భూమి పూజచేస్తే నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు మూడు రాజధానుల పేరుతో వికృత, రాక్షస క్రీడకు శ్రీకారంచుట్టారు. సీఆర్డీఏ చట్టాన్ని వెనక్కు తీసుకున్నారు. శాసనసభలో అమరావతికి మద్దతు పలికి, నమ్మబలికి అధికారంలోనికి వచ్చిన అనంతరం యూటర్న్ తీసుకున్నారు. మూడురాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధిని తొక్కేశారు. నాటి పాలకులు తడిగుడ్డతో రైతులు, ప్రజల గొంతు నులిమే ప్రయత్నంచేశారు కబ్జాలు, కక్షలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. రైతులపై కక్ష సాధింపు చర్యలకు తెగబడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా దాష్టికాలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి తాండవం చేసింది.

200 మంది వరకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే రైతులందరూ ఒక వర్గానికి చెందిన వ్యక్తులు గా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేశారు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు బడుగు, బలహీనవర్గాల చిన్నసన్న కారు రైతులే. రాయలసీమలో హైకోర్టు బెంచీ కోసం కనీసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదు. పుట్టిన రోజుల సందర్భంగా విభజన చట్టంలో ఉన్న స్టీల్ ప్లాంటు కోసం మూడుసార్లు భూమి పూజలు చేశారు. చేయాలి చెల్లి పెళ్లి..మళ్ళీ మళ్ళీ అన్న చందంగా వ్యవహరించారు.
Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం

2024 ఎన్నికల్లో అందరం కలిసి వైరస్ ను తుదముట్టించాం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సమన్వయంతో ఉత్తరాంద్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విదంగా ఉన్నత విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. విశాఖ రైల్వేజోన్ దగ్గర నుంచి అనంతపురం సెంట్రల్ వర్శిటీ ఏర్పాటు వరకు అనేకరకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమరావతిచుట్టూ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతోంది స్మార్ట్ సిటీ వంటి ప్రాజెక్టులతో పునర్నిర్మాణం వేగంగా సాగుతోంది రైతుల త్యాగత నిరతికి హ్యాట్సాఫ్ అమరావతి ఇకపై ఆంధ్రుల శాశ్వత రాజధానిగా విరాజిల్లుతుంది భాజపా తరపున సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నా గతంలో రైతులకు సంఘీభావం తెలిపివస్తుంటే నాపై నాటి పాలనలో దాడికి పాల్పడ్డారు సంఘీభావం తెలియచేయడం కూడా తప్పేనా?.
Bjp Support : సీఎం సహా.. సభ నవ్వుల జల్లు

డిప్యూటీ సీఎం నటించిన అత్తారింటికి దారేది సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానంందం చెట్టు కింద నిల్చోని అబద్దాలు చెబుతుంటే ఆకులు నేలరాలతాయి. గతంలో ఐదేళ్లపాటు సీఎం కొనసాగిన వ్యక్తి (జగన్)ని నల్లమల అడవులకు తీసుకువెళ్లి చెట్ల కింద మూడు నిమిషాలపాటు మాట్లాడిస్తే ఆకులన్నీ నేలవాలి మోడుబారిపోతాయి.

ఇలా పది నిమిషాలపాటు మాట్లాడితే నల్లమల అడవి భస్మీపటలమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తి మళ్ళీ మాటలు మారుస్తూ గతంలో నేను అక్కడే (అమరావతిలో) ఇళ్లు కట్టుకున్నాను కాదా! రాజధానిగా అమరావతికి శాసనసభలో మద్దతు తెలిపాం కాదా? అని మోసపూరితంగా మాట్లాడుతున్నారు. ఈరోజు శాసనసభలో చేయబోయే తీర్మానంవల్ల రైతులకు న్యాయం జరుగుతుంది. రాజధాని అభివృద్ధి ఉజ్వలంగా ఉండబోతుంది” అని శ్రీ సత్యకుమార్ వివరించారు.
ALSO READ : 11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha Assembly News
