super 8 |గట్టిగా కొట్టాల్సిందే..

super 8 |గట్టిగా కొట్టాల్సిందే..
- సఫారీతో భారత్కు సవాల్
- నేడు దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ
- సూపర్ 8లో కీలక మ్యాచ్
- టీమిండియా బ్యాటింగ్పై టెన్షన్
- సమష్టిగా రాణించకుంటే కష్టమే..
- అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో మ్యాచ్
- రాత్రి 7గంటలకు ప్రారంభం

super 8 |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు నేడు కఠిన పరీక్ష ఎదుర్కొబోతోంది. ‘సూపర్-8’లో భాగంగా అహ్మదాబాద్లో జరగనున్న కీలక పోరులో ఇవాళ భారత్, సౌత్ఆఫ్రికాను ఢీకొనబోతోంది. మొత్తానికి ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఆదివారం జరగబోయే ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారత్ తన అజేయ యాత్రను కొనసాగించాలని చూస్తుంటే, దక్షిణాఫ్రికా పాత ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. గ్రూప్ దశలో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్లపై వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీం ఇండియాకు స్ట్రాంగ్ టీం దక్షిణాప్రికాతో సవాల్ తప్పదు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు టీమిండియా సమష్టిగా రాణించలేదని చెప్పవచ్చు. ఒక మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మెరిసితే, మరొక దాంట్లో ఇషాన్ కిషన్ లేదా హార్దిక్ పాండ్య రాణించారు. కానీ మొత్తం బ్యాటింగ్ యూనిట్ ఒకేసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా సున్నాలకే అవుటవ్వడంపై టీమిండియాను కలవర పెడుతోంది. ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ ఖాతా తెరవలేకపోయాడు. కీలక సమయంలో ‘జీరో’ నుంచి ‘హీరో’గా మారాల్సిన అవసరం ఉంది. సఫారీ బౌలర్లపై మెరుపులు మెరిపిస్తే భారత్కు భారీ ఊపిరి పీల్చినట్టే అవుతుంది. భారత్ వ్యక్తిగత మెరుపులపై ఆధారపడకుండా సమష్టిగా రాణిస్తేనే విజయావకాశాలు మెరుగుపడతాయి. లేకపోతే సూపర్-8 దశే చివరిదిగా మిగిలే ప్రమాదం ఉంది. అభిమానులు మాత్రం హోరాహోరీ పోరుకు సిద్ధంగా ఉన్నారు.

బౌలింగ్ విభాగం ఓకే..
భారత బౌలింగ్ దళం స్ట్రాంగ్గా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లోతుగా ఉన్న నేపథ్యంలో టీమిండియా బౌలర్లంతా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి వికెట్ల తీయాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య పేస్ బౌలింగ్లో రాణిస్తూ వికెట్లు తీస్తున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బంతులు వేస్తూ మధ్య ఓవర్లలో బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.

సౌత్ఆఫ్రికా వెరీ స్ట్రాంగ్
దక్షిణాఫ్రికా కూడా తమ గ్రూప్ దశలో నాలుగు విజయాలతో టాప్లో నిలిచింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ నాయకత్వంలో జట్టు సమష్టిగా రాణిస్తోంది. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ వంటి పవర్ హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. బౌలింగ్లో కూడా అదరగొడుతోంది. కగిసో రబడా, అన్రిచ్ నోర్కియా, కేశవ్ మహరాజ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా ఛేదనలో సఫారీ జట్టు దూకుడుగా ఆడుతూ లక్ష్యాలను సులభంగా చేరుకుంటోంది.

పిచ్ బ్యాటింగ్కు అనుకూలం
అహ్మదాబాద్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టీ20ల్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ మైదానంలో లక్ష్య ఛేదన సులభంగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది.

సిరాజ్కు గాయం..
ప్రాక్టీస్ చేసే సమయంలో పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. హార్దిక్ పాండ్య కొట్టిన షాట్ సిరాజ్ కాలికి బలంగా తాకడంతో అతను నడవడానికి ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే కుల్దీప్ యాదవ్ లేదా అర్ష్దీప్ సింగ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ మందకొడిగా ఉండే అవకాశం ఉంది. గత మ్యాచ్లో ఇక్కడ స్పిన్నర్లు వికెట్లు పడగొట్టారు. బంతి బ్యాటుపైకి రావడం కష్టంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదు కావాలంటే బ్యాటర్లు ఎంతో ఓపికగా ఆడాల్సి ఉంటుంది.

భారత్దే పైచేయి
టీ20 ప్రపంచకప్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, దక్షిణాఫ్రికాపై భారత జట్టు రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. ఐసీసీ టోర్నీలలో, ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్లలో టీమిండియా సఫారీ జట్టుపై తరచుగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు మొత్తం 7 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత జట్టు 5 సార్లు ఘనవిజయం సాధించగా, దక్షిణాఫ్రికా కేవలం 2 సందర్భాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలు చూస్తుంటే ఈ మ్యాచ్లో భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుందని స్పష్టమవుతోంది.

ఈ మ్యాచ్ను ఎక్కడ చూడవచ్చు?
భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఈ ఉత్కంఠభరిత పోరును భారతీయ అభిమానులు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ను జియో హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో చూడవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివం దూబె, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్/అర్ష్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
