Tirumala| తిరుమల కిటకిట..

Tirumala| తిరుమల కిటకిట..
- భారీగా తరలివచ్చిన భక్తులు
- కంపార్ట్మెంట్లన్నీ ఫుల్
- సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala| ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఒకటి రెండు రోజులు సెలవులు వచ్చినా జనం శ్రీవారి దర్శనానికి బయల్దేరి వెళ్తారు. ఇక పర్వదినాల రోజున వైకుంఠనిలయంలో దేవదేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే తమ కష్టాలు, సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆదివారం కావడంతో పాటు శివరాత్రి కూడా కలసి రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తిరుమల కొండ కిటకిట లాడుతుంది. గోవింద నామస్మరణలతో మాడ వీధులు మార్మోగుతున్నాయి.

ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీఎస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,337 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,825 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.58 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

