mla |వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఎపీ లక్ష్యం…

mla |వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఎపీ లక్ష్యం…
నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పురోగతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది
రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టానికి తగ్గట్టుగా కేంద్రం ఏపీ కి సహకారం …
ఎమ్మెల్యే సుజనా చౌదరి..
mla | భవానిపురం, ఆంధ్రప్రభ: వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లక్ష్యంతోనే ఎన్టీయే ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. అశాస్త్రీయ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని కేంద్రం భర్తీ చేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి సంబందించిన హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు, ఎక్స్ప్రెస్వేల నిర్మాణం, బ్లూ ఎకానమీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించడం హర్షనీయమన్నారు. అదేవిధంగా, కేంద్రం నుండి గరిష్ట నిధులు సాధించేలా సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. వ్యవసాయానికి గ్లోబల్ బ్రాండింగ్, ప్రత్యేకించి కొబ్బరి, కోకో, జీడిమామిడి పంటలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని కొనియాడారు.
పర్యాటకం, ప్రకృతి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని గుర్తు చేశారు. గత 12 ఏళ్లుగా శాస్త్రీయత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కారణంగా మనం కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి మోదీ నాయకత్వంలో కేంద్రం అండగా ఉంటోందని తెలిపారు. హై స్పీడ్ ట్రైన్ కారిడార్ల ఏర్పాటు, మహిళల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, బ్లూ ఎకానమీలకు ప్రోత్సాహలలో రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని వివరించారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం సెక్టార్ల వారీగా కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. 2014-15 నుండి ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత బడ్జెట్ రూపకల్పన మారిందని. రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో విలీనం చేశారన్నారు. ఇప్పుడు రాష్ట్రాల వారీగా కాకుండా, సెక్టార్ల వారీగా, వినియోగం ఆధారంగా నిధులు కేటాయిస్తున్నారు కావున ప్రజలు విషయాన్ని అవగాహన పర్చుకోవాలని సూచించారు.
గతంలో కొన్ని జిల్లాలకు కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ, రికార్డులు సమర్పించక పోవడం వల్ల నిధులు నిలిపివేశారని తెలిపారు. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి ఆకాంక్షాత్మక జిల్లాలు గా పేరు మార్చారన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న ప్రకాశం జిల్లాకు ఇప్పుడు ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు మరియు ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కాలానికి అనుగుణంగా మనం మారాలి, సమాజం మారాలని, గతంలో టెలిగ్రామ్లు ఉండేవని, ఇప్పుడు ఈమెయిల్లు వచ్చాయి కదా అదే విధంగా మార్పులు సహజమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏపీ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి టాప్ 1 ర్యాంక్ రావడం అభినందనీయమన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తోన్నందున ఆయనను పార్టీ తరపున సత్కరించామని తెలిపారు. నియోజకవర్గంలో ఆయన చేస్తున్న సేవలకు ఇది గుర్తింపు అని కొనియాడారు.
