Exclusive – వ‌సూళ్ల‌లో చైత‌న్యం … సాఫ్ట్​గా కరెన్సీ కలెక్షన్​

ట్యాక్స్ ఎగవేతకు శ్రీ చైత‌న్య‌ ప్లాన్‌
మాదాపూర్ బ్రాంచ్‌లో లెక్కతేలనంత‌గా నగదు
విజయవాడ, ఖమ్మం, విశాఖలోనూ అలజడి
నోట్ల క‌ట్ట‌లు చూసి విస్తుపోతున్న ఐటీ అధికారులు
అసలు బ్రాంచీలెన్ని, విద్యార్థుల లెక్క ఎంత?
రెండ్రోజులుగా కొన‌సాగుతున్న సోదాలు
డెరెక్ట‌ర్ల ఇళ్లు, ఆఫీసుల్లోనూ త‌నిఖీలు
వెలుగులోకి వ‌స్తున్న విస్తుపోయే వాస్త‌వాలు

హైదరాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ :

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి. విద్యావ్యాపారంలో టైకూన్ శ్రీ చైతన్య కాలేజీలో ఆర్దిక లావాదేవీల్లోని అసలు గుట్టును ఆదాయ పన్ను శాఖ బ‌య‌ట‌పెట్టేసింది. నోట్ల కట్టల లెక్కలను తీస్తోంది. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబ‌యి, బెంగళూరు, చెన్నైలో సుమారు 30 చోట్ల రెండో రోజూ ఏకకాలంలో తనిఖీలు జ‌రుగుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్‌లో జరిపిన సోదాల్లో ₹2 కోట్లకు పైగా లెక్కలేని నగదును గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా తమ కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకుని ఆదాయపన్ను ఎగవేసినట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు.

సాఫ్ట్​గా భారీ వసూళ్లు

విద్యార్థుల నుంచి డబ్బు వసూళ్ల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ తయారు చేసి లావాదేవీలు నిర్వహిస్తూ.. ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్ వేర్ తయారు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాదాపూర్‌లోని శ్రీచైతన్య కార్పొరేట్‌ కాలేజీలో రికార్డులు, డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపు రశీదులను పరిశీలించారు. డైరెక్టర్ల కార్యాలయాలనూ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదుల రావడంతో ఈ కాలేజీలపై ఐటీ శాఖ దృష్టి మళ్లింది. ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది. పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం.

డెట్యాక్స్ ఎగ్గొట్టేందుకు యాప్..

సంస్థల్లో చేరుతున్న విద్యార్థులు, ఆదాయానికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన దానిపై అధికారులు దృష్టి సారించారు. తాజాగా యలమంచిలి శ్రీధర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. మొదట మాదాపూర్‌ బ్రాంచ్‌లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత యలమంచిలి శ్రీధర్ ఇంట్లో కూడా పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అటు.. ఖమ్మంలో ఉన్న మరో డైరెక్టర్ నివాసంలో తనీఖీలు చేయడానికి అధికారులు రెడీ అయ్యారు. స్టూడెంట్స్ నుంచి ఫీజులు కట్టించుకొని ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టే విషయంలో అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. ట్యాక్సులు ఎగ్గొట్టడానికి శ్రీ చైతన్య యాజమాన్యం ప్రత్యేకంగా కొన్ని దారులు వెతుక్కున్నట్టు అధికారులు గుర్తించారు. విద్యార్థులతో లావాదేవీలు జరపడానికి సాఫ్ట్‌వేర్, ప్రభుత్వానికి కట్టే టాక్స్ కట్టడానికి మరో సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకున్నారు. రెండు యాప్‌ల ద్వారా స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేసినట్టు గుర్తించారు. దీంతో ఫీజుల చెల్లింపునకు రెండు యాప్‌లు ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

బ్రాంచీలెన్నీ.. వసూలు చేసిందెంత..

శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన మొత్తం ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ పేమెంట్ చేశారు? ఓన్లీ క్యాష్ ద్వారా కోట్ల రూపాయల ఫీజుల కట్టించుకొని ట్యాక్సులు ఎగ్గొట్టారని అధికారులు తేల్చారు . మాదాపూర్ బ్రాంచిలో 2 కోట్ల రూపాయలకు పైగా క్యాష్ గుర్తించారు. ఇక దీనితోపాటు.. పలు కాలేజీలకు, భవనాలకు అనుమతులు లేవని తేలింది. పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌ బ్రాంచ్‌లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక విజయవాదలోని ప్రధాన కేంద్రంలోని శ్రీ చైతన్య కాలేజీల్లోనూ తనిఖీలు జరుతున్నాయి. దేశవ్యాప్తంగా 30 కేంద్రాల్లో తనిఖీ చేసిన ఐటీ అధికారులు విస్తూపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రూ.100కోట్ల క్యాష్ లావాదేవీలు అధికారుల దృష్టికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *