online games | ప్రాణాలతో గేమ్స్ వద్దు
online games | ప్రాణాలతో గేమ్స్ వద్దు
- ఉసురు తీస్తున్న ఆన్లైన్ గేమ్స్
- బానిసలుగా మారుతున్న పిల్లలు, యువత
- మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు
- తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువు
- కొరియన్ లవ్ గేమ్కు బానిసలైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
- 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
- ఉత్తర్ప్రదేశ్ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

online games | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషి మనుగడలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ ప్రతీ ఒక్కరి చేతిలోకి చేరింది. అయితే ఇది మంచిగా ఉపయోగించుకుంటే మంచి.. చెడుగా ఉపయోగించుకుంటే చెడు అనే రీతిగా మారింది. స్మార్ట్ ఫోన్లో వచ్చిన తర్వాత జస్ట్ ఒక్క క్లిక్ తోనే అన్ని రకాల సదుపాయాలు అందేలా ఎన్నో రకాల యాప్స్ పుట్టుకొచ్చాయి. తద్వారా అటు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఎన్నో గేమింగ్ యాప్స్ కూడా ఆన్లైన్ లో చాలా ఉండటంతో యువత విరివిగా వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. ప్రధానంగా స్మార్ట్ ఫోన్లో గేమ్స్ అందుబాటులో ఉండటంతో ప్రతీ ఒక్కరూ వాటిని ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెళ్లిమెళ్లిగా వాటికి బానిసై పోతున్నారు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు గేమ్ ఓపెన్ చేస్తున్నారు. అంతకేకాకుండా కొందరు పిల్లలు ఆన్లైన్ గేమింగ్కు బానిసై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ గేమ్స్కు బానిసై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆన్లైన్లో గేమ్స్ ఎక్కువగా ఆడి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనుకావడం, ఆరోగ్య సమస్యల వల్ల యువత, చిన్నారులు ప్రాణాలు వదులుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు పిల్లల తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చుతున్నాయి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ.. మానసికంగా దెబ్బ తింటున్నారు. చాలామంది చదువులు మానేసి మరీ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బంగారు భవితను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్.. పిల్లల ఉసురు తీస్తోంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని పిల్లలను ఈ గేమింగ్ డిజార్డర్ నుంచి కాపాడుకోవాల్సిన అవరసం ఉంది. లేదంటే మీ కళ్ల ముందే మీ పిల్లలు దూరమయ్యే ప్రమాదం ఉంది.

ఉత్తరప్రదేశ్లో అక్కాచెల్లెళ్లు..
ఆన్లైన్ గేమ్స్కు బానిసలై ముగ్గురు బాలికలు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు భవనం నుంచి కిందకు దూకేశారు. దీంతో వారు స్పాట్లోనే మృతి చెందారు. లవ్, సూసైడ్ గేమ్కు బానిసలై ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్ప్రదేశ్ గజియాబాద్లో జరిగింది. 16, 14, 12 ఏళ్ల నిషిక, ప్రచి, పఖి అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ అపార్ట్మెంటు 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు అమ్మా, నాన్నా తమను క్షమించాలంటూ ఒక నోట్ను రాసిపెట్టారు. అందరూ నిద్రపోయేదాకా చూసి రాత్రి 2 గంటల సమయంలో అపార్ట్మెంట్ పై నుంచి దూకారు. శబ్ధం విని బయటకు వచ్చిన చుట్టుపక్కలవారు రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారులను చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని సీల్ చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సమయానికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కొరియన్ టాస్క్-బేస్డ్ ఆన్లైన్ గేమ్…
ఈ విషాద ఘటనకు కారణ ఒక కొరియన్ టాస్క్-బేస్డ్ ఆన్లైన్ గేమ్. ఆ గేమ్కు ఈ ముగ్గరు అమ్మాయిలు బానిసలయ్యారని పోలీసులు భావిస్తున్నారు. బాలికల తండ్రి చెతన్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ గేమ్లో మొత్తం 50 టాస్కులు ఉండగా సోమవారం చివరి టాస్క్ పూర్తయిందట. ఈ టాస్క్ పూర్తవ్వగానే ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డట్టు చెబుతున్నారు. “మా పిల్లలు ఇలాంటి టాస్క్ గేమ్ ఆడుతున్నారని నాకు అస్సలు తెలియదు. లూడో లాంటి గేమ్ ఆడుతున్నారు అనుకున్నాను. చనిపోవాలని చెప్పే గేమ్ ఉంటుందని ఊహించలేదు. ఫోరెన్సిక్ నిపుణులే ఈ విషయం చెప్పారు. వారు ఉపయోగించిన మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు,” అని కన్నీళ్లతో బాలికల తండ్రి చెతన్ కుమార్ వెల్లడించారు.
