Friends | ఏకంగా చంపేశాడు..

Friends | ఏకంగా చంపేశాడు..
Friends | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో చిన్న చిన్న వాటికి ఘర్షణలు పడడం, చంపుకోవడం సాధారణంగా మారిపోయింది. సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మరొకరి నాలుక తెగి, తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా కమ్మసంద్రలో ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాలిలా ఉన్నాయి… క్రికెట్ పోటీలకు ఇద్దరు స్నేహితులు ప్రశాంత్ (35), రోషన్ హెగ్డే వెళ్లారు. మ్యాచ్ ఆడాక ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో స్నేహితులు ఇద్దరి మధ్య సిగరెట్ లైటర్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ ముదరడంతో బీర్ బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రోషన్ హెగ్డే నాలుకకు తీవ్రగాయమైంది. తీవ్రగాయాలు కావడంతో భయపడిపోయిన రోషన్ తన కారులో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ప్రశాంత్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కారు డోర్ పట్టుకుని అడ్డగించేందుకు చూశాడు.
ప్రశాంత్ను అలాగే కారుతో ఈడ్చుకెళ్లి వేగంగా చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందాడు. ప్రశాంత్ మృతికి కారణమైన రోషన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోషన్ నాలుక తెగిపోవడంతో పాటు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.
