ఈనెల 30న శాంతికుమారి ఉద్యోగ విరమణ
తర్వాత సీఎస్ ఎంపిక కోసం పరిశీలనలో పలువురి పేర్లు
ప్రయత్నాలు ముమ్మరం చేసిన స్పెషల్ సీఎస్లు
ముందు వరుసలో జయేష్ రంజన్, రామకృష్ణారావు
సీనియర్ ఐఏఎస్లు వికాస్రాజ్, శశాంక్ గోయల్కూ చాన్స్!
రామకృష్ణారావుపై మొగ్గు చూపుతున్న సీఎం రేవంత్?
అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ. ఇదే హాట్ టాపిక్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరనేదానిపై ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్త సీఎస్ పరిశీలనలో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. శాంతికుమారి స్థానంలో కొత్త సీఎస్ ఎవరు వస్తారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
సీనియర్ ఐఏఎస్ల ప్రయత్నాలు..
స్పెషల్ సీఎస్లుగా ఉన్నవారిలో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటి నుంచే చీఫ్ సెక్రెటరీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. సీనియర్ ఐఏఎస్లతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఉన్నతాధికారులు కూడా ఈ ఉన్నత పదవి కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ఈ రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎస్గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. రేవంత్ ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా.. శాంతి కుమారినే చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూ వస్తోంది.
రామకృష్ణారావు, జయేశ్రంజన్ పేర్లు..
కాగా, 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు ఈ ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్గా ఆయన కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండగా, ప్రభుత్వానికి అవసరమైన నిధులను సమకూర్చడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు పేరుంది. దీంతో రామకృష్ణారావు వైపే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ప్రస్తుతం ఐటీ, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్గా కొనసాగుతున్నారు. ఈయన పేరు కూడా సీఎస్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.