Siddipet | కుటుంబాల క‌ల‌హాల‌తో భార్య ఆత్మ‌హ‌త్య‌… ఆ వెంట‌నే భ‌ర్త కూడా ..

సిద్దిపేట – కుటుంబంలో కలహాలు నేప‌థ్యంలో మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా, ఆ వార్త విన్న కాసేపటికే ఆమె భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో నలుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం జరిగింది.

స్థానికుల కథనం ప్రకారం… తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజు(40)కు పదేళ్ల కిందట రేణుకతో వివాహమై ఇద్దరు పిల్లలు కలిగారు. ఆరేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భాగ్యలక్ష్మి(35)తో నాగరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు లక్ష్మీ, శ్రావణ్‌ జన్మించారు. నాగరాజు కుటుంబం స్థానికంగా ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంట్లో నివాసముంటోంది. కూలీపనులు చేసుకుని నాగరాజు భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు.

పురుగుమందు తాగి ఆత్మహత్య..
అయితే, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భాగ్య ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తమ ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. భాగ్య అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారు. అప్పటిదాకా అక్కడే ఉన్న నాగరాజు భార్య మరణవార్త విన్న వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి తన కుటుంబీకులకు ఫోన్‌ చేసి తాను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి కట్‌ చేశాడు.
కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నాగరాజు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు అతడు ఉన్న లొకేషన్‌ను వెళ్లారు. సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సమీపంలోని చెట్ల మధ్య అచేతనంగా పడి ఉన్న నాగరాజును రాత్రి ఎనిమిది గంటలప్పుడు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసిన తొగుట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *