ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి – ఎస్ఎఫ్ఐ డిమాండ్
6న కలెక్టరేట్ వద్ద నిరసనకు ఎస్ఎఫ్ఐ పిలుపు
భీమవరం, ఆంధ్రప్రభ: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి టి. ప్రసాద్ డిమాండ్ చేశారు. భీమవరంలో గురువారం ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ మేరకు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్ చార్జీలను రూ.3 వేలకు పెంచాలని కోరారు. అలాగే విద్యార్థుల సమస్యలను గుర్తించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్. లక్ష్మణ్, పి. సాయి కృష్ణ, పి. త్రినాథ్, జి. కౌశిక్, జి. అభి తదితరులు పాల్గొన్నారు.
